భువనగిరిటౌన్ : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి పాల్గొని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం ఇవ్వడం కోసం వచ్చిన దివ్యాంగుడు ఏశాల గోపిని గమనించిన కలెక్టర్.. స్టేజీ దిగి కిందకు వచ్చి అర్జీని స్వీకరించి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ అధికారులనుద్దేశించి మాట్లాడుతూ.. బాధితులకు న్యాయం చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని, అర్జీదారులకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 113 దరఖాస్తులు రాగా.. వాటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించినవే 56 అర్జీలు నమోదయ్యాయి. మిగిలిన దరఖాస్తుల్లో హౌసింగ్ శాఖకు 10, మున్సిపాలిటీకి 7, సర్వే ల్యాండ్ విభాగానికి 5, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు 4, సంక్షేమ శాఖకు 4, జిల్లా పరిషత్కు 4 చొప్పున వచ్చాయి. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖలకు మూడు చొప్పున దరఖాస్తులు రాగా.. వ్యవసాయం, ఉపాధి కల్పన, పంచాయతీరాజ్ శాఖలకు రెండు చొప్పున అర్జీలు అందాయి. వీటితోపాటు సమాచార శాఖ, ఇరిగేషన్, రవాణాశాఖ, పశు సంవర్థక శాఖ, ఫుడ్ సేఫ్టీ, ఫిషరీస్, కో ఆపరేటీవ్, అటవీ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ వివరించారు. ఈ దరఖాస్తులన్నింటినీ ఆయా శాఖల అధికారులు తక్షణమే పరిశీలించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ కృతిక, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి


