సాక్షి, యాదాద్రి : భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. భూభారతి, ప్రభుత్వ భూములు, సాదా బైనామాలు, ఓటరు జాబితా సవరణ , మీ సేవ సేవలు, ధాన్యం కొనుగోళ్లు, ఆన్లైన్ ఇసుక సరఫరా తదితర అంశాలపై బుధవారం కలెక్టరేట్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. భూభారతి ద్వారా భూముల రికార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు పారదర్శక సేవలు అందించాలన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం కింద ఓటరు జాబితాలను కచ్చితంగా సవరించాలని, బూత్ స్థాయి అధికారుల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలన్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు మన ఇసుక వాహనం ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని తహసీల్దార్లు కచ్చితంగా అమలు చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవె న్యూ అధికారి జయమ్మ, ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి


