భీమవరం (ప్రకాశంచౌక్) : దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఎనిమిదేళ్లు కావస్తున్నా దళితపేటల్లో మౌలిక వసతులు కొరవడటం ప్రభుత్వాల అసమర్థతకు నిదర్శనమని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.బలరాం విమర్శించారు. దళిత పేటలకు జీఓ నెం.1235 ప్రకారం రెండు ఎకరాల చొప్పున స్మశాన వాటికలు కేటాయించాలని, మైదాన ప్రాంత గిరిజనులైన యానాదులు, ఎరుకలు, చెంచులకు కనీస గుర్తింపుతో పాటు మరుగుదొడ్లు, మంచినీటి వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సో మవారం కలెక్టరేట్ వద్ద సామాజిక శంఖారావం, చలో కలెక్టరేట్ ధర్నా నిర్వహించారు. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్, మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్ తదితరులు ప్రసంగిస్తూ.. దళితుల సమస్యల పరిష్కారానికి రాజకీయాలకు అతీతంగా అందరూ ఐక్యమై పోరాడాలని పిలుపునిచ్చారు. జిల్లాలో నిర్వహించిన సర్వేల ద్వారా 80 శాతం దళిత కాలనీల్లో శ్శశాన వాటికలు లేవని, ఉన్న 20 శాతం కూడా ఆక్రమణకు గురయ్యాయని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో మరింత తీవ్రమైన కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. అనంతరం శ్శశాన వాటిక సమస్య ప్రతిబింబించేలా ఖాళీ శవపేటికలు ప్రదర్శనకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కె.క్రాంతిబాబు సహా నేతలు అక్కడే బైఠాయించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, కై లు రైతు సంఘం, రైతు సంఘం, ఐద్వా, వృత్తిదారుల సంఘం, ఎస్ఎఫ్ఐ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.


