ద్వారకాతిరుమల: చినవెంకన్న సన్నిధి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో పాటు శనివారం రాత్రి పెద్ద సంఖ్యలో వివాహాలు జరగడంతో సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు, పెళ్లి బృందాలు క్షేత్రానికి తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. దర్శనం క్యూలైన్లు, అనివెట్టి మండపాలు, కల్యాణకట్ట, నిత్యాన్నదాన భవనం తదితర విభాగాలు భక్తులతో కిక్కిరిశాయి. స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. మరోవైపు శ్రీవారి సన్నిధిలో ఆదివారం ఉదయం కూడా పెద్ద ఎత్తున వివాహాలు జరిగాయి. దీంతో నూతన వధూవరులు, వారి బంధుమిత్రులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. అనివెట్టి మండపంలో భజన మండళ్ల సభ్యుల కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి.


