రైల్వే మంత్రికి విన్నవించాం
తాడేపల్లిగూడెం: భౌగోళికంగా జిల్లాకు కేంద్ర స్థానం.. ప్రముఖ వాణిజ్య, విద్యా కేంద్రం.. చెన్నె–హౌరా మార్గంలో (మెయిన్ లైన్) జిల్లాలో ఏ గ్రేడ్ స్టేషన్.. రోజుకు సుమారు 7,900 మంది ప్రయాణాలు.. ఆదాయం రూ.6 లక్షలకు పైమాటే.. అయినా పలు రైళ్లకు హాల్టులు లేవు.. ప్రజల వినతులు, వేడుకోలు తప్ప పట్టించుకునే నాథుడు కరువు.. కూటమి పార్టీ ఎమ్మెల్యే ఉన్నా.. బీజేపీ ఎంపీ పరిధిలో ఉన్నా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. పలు రైళ్లకు ఇక్కడ హాల్టులు ఇవ్వాలనే డిమాండ్ బలంగా ఉన్నా ఆచరణ సాధ్యం మాత్రం కావడం లేదు.
ఆది నుంచి అంతే.. గతంలో తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చివరిది. ఏలూరుకు 18 ఏళ్లపాటు ఎంపీగా చేసిన బోళ్ల బులిరామయ్య గూడేనికి చేసిందేమీ లేదు. పైగా గూడెం అభివృద్ధి కాకూడదనుకున్నారో ఏమో బైపాస్ రోడ్డు ఊరి బయట నుంచి వేశారనే విమర్శలు ఉన్నాయి. అనంతరం కావూరి సాంబశివరావు సమయంలోనూ చేసిందేమీ లేదు. రెండో ఫ్లై ఓవర్ వంతెన నిర్మాణంలో కేంద్ర వాటా సొమ్ము కూడా ఇప్పించలేదు. కనుమూరి బాపిరాజు ఎంపీగా ఉన్నప్పుడు కోరమాండల్ ఎక్స్ప్రెస్కు హాల్టు ఇప్పించారు. ప్రస్తుత బీజేపీ ఎంపీ శ్రీనివాసవర్మ కూడా హాల్టులు కోసం ఏమాత్రం ప్రయత్ని ంచడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ఏ గ్రేడ్ స్టేషన్ అయినా..
చెన్నె–హౌరా మార్గంలో (మెయిన్ లైన్) ఏ గ్రేడ్ రైల్వేస్టేషన్గా జిల్లాలో తాడేపల్లిగూడెం నిలిచింది. ఇక్కడ నిలిచే రైళ్ల వల్ల 81 శాతం ఆదాయం వస్తుంది. ఇక్కడి స్టేషన్లో 38 రైళ్లు ఆగుతాయి. వారాంతపు, ఇతర రైళ్లు 24 వెళుతుంటాయి. రోజుకు 7,900 మంది ప్రయాణికులు రైళ్లు ఎక్కుతున్నారు. రోజుకు రూ.6,14,000 ఆదాయం వస్తుంది. ఇక్కడ సూపర్పాస్టు రైళ్లకు హాల్టులు ఇవ్వాలని, వందేభారత్ను నిలుపుదల చేయాలని పలువురు కోరుతున్నారు. జాతీయ విద్యాసంస్థ నిట్ ఇక్కడ ఉండటంతో సూపర్ఫాస్ట్ రైళ్లకు హాల్టులు ఇవ్వాల్సి ఉంది. అలాగే డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఇక్కడుంది. అహ్మదాబాద్, వడోదర ప్రాంతాలకు వెళ్లే రైలు నుంచి సుమారు 22 రైళ్లకు హాల్టులు ఇవ్వాలని ఏళ్ల తరబడి చేస్తున్న వినతులు బు ట్టదాఖలవుతున్నాయి. కనీసం ఎంపీలు కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
తాడేపల్లిగూడెం ప్రాంతం భౌగోళికంగా జిల్లాకు కేంద్ర స్థానంలో ఉంది. ప్రముఖ వాణిజ్య, విద్యాకేంద్రం. ఇక్కడ చాలా కాలంగా సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టులు ఇవ్వాలని కో రుతున్నాం. డీఆర్ఎంకు, కేంద్ర రైల్వే శాఖ మంత్రికి వినతులు ఇచ్చాం. ఎవరూ స్పందించడం లేదు. ఇక్కడ రైళ్లకు హాల్టులు ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది.
– రవి అగర్వాల్, జెడ్ఆర్యూసీసీ సభ్యుడు
ఇంకెన్నాళ్లీ చిన్నచూపు
ఆదాయం ఉన్నా ఆగని రైళ్లు
ఎంపీకి వినతులు ఇచ్చినా స్పందన నిల్
కూటమి పాలనలో చర్యలు శూన్యం
ఏ గ్రేడ్ స్టేషన్ అయినా తప్పని నిరాదరణ


