భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం రెవెన్యూ, సర్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న 1,92,591 పెండింగ్ ఓటరు కేసులను ఈ నెలాఖరులోగా పరిశీలించి క్లోజ్ చేయాలని, భూమి రీ–సర్వేను గడువులోగా పూర్తి చేసి తప్పులు లేని పాసుపుస్తకాలు అందించాలని ఆదేశించారు. అలాగే పెండింగ్లో ఉన్న 22–ఏ భూముల కేసులను రెవెన్యూ రికార్డుల ఆధారంగా సత్వరమే పరిష్కరించాలని సూచించారు. అలాగే కలెక్టరేట్లో జిల్లా స్థాయి సిఫార్సు కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జువైనెల్ జస్టిస్ చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తూ అనుమతులు లేకుండా నడుస్తున్న చైల్డ్ కేర్ సంస్థలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు పాటించని 11 సంస్థల దరఖాస్తులను తిరస్కరించి, ఇప్పటికే నాలుగు సంస్థలను మూసివేశామని, నిబంధనలకు అనుగుణంగా ఉన్న రెండు సంస్థలకు తుది రిజిస్ట్రేషన్ మంజూరుకు సిఫార్సు చేశామని తెలిపారు. వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భీమవరం కలెక్టరేట్లో పోడూరు మండలం సబ్బేవారిపేటకు చెందిన పోలియో బాధితురాలు బుంగ కృష్ణకుమారికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వీల్చైర్ అందజేశారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, సహాయక ఉపకరణాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.


