● జిల్లాలో 64,235 వ్యవసాయ కనెక్షన్లు
● బోరుబావుల కింద 1.20 లక్షల
ఎకరాల వరి సాగు
● ఆందోళనలో రైతులు
‘ఈ ఫొటోలోని రైతు పేరు పోసిరిగారి రాజు. అమరచింత సమీపంలో ఉన్న తన వ్యవసాయ
పొలంతో పాటు మరో 6 ఎకరాలు కౌలుకు తీసుకొని గత నెలలో కురిసిన వర్షాలకు పత్తి విత్తనాలు నాటారు. ప్రస్తుతం వాన జాడ కనిపించకపోవడంతో పక్క పొలం రైతు బోరుమోటారుకు
స్ప్రింకర్లను బిగించి పొలం తడుపుతున్నారు. నిత్యం విద్యుత్ కోతలతో 6 ఎకరాలు కూడా తడవని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రూ.రెండు లక్షల పెట్టుబడి అయిందని.. పంట కాపాడుకునేందుకు పొలానికే పరిమితం కావాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.’
అమరచింత: బోరుబావుల కింద వానాకాలం పంటలు సాగు చేసిన అన్నదాతలు అప్రకటిత విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో బోరుబావుల కింద వరి వరి నాట్లు వేసుకున్నారు. ప్రస్తుతం కేవలం రోజుకు 15 గంటల మాత్రమే విద్యుత్ సరఫరా అవుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. నీరు సమృద్ధిగా ఉన్న బోరుబావుల కింద వరి సాగు చేయగా.. నీటి సౌకర్యం అంతంత మాత్రం ఉన్న బోరుబావుల కింద ఆరుతడి పంటలైన పత్తి, కంది సాగు చేపట్టారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవక భూగర్భ జలాలు సైతం తగ్గడంతో ఆరుతడి పంటలు కాపాడుకునేందుకు రైతులు పడుతున్న కష్టాలు వర్ణానాతీతం. జిల్లాలోని ప్రధాన జలాశయాలైన జూరాలతో పాటు రామన్పాడు, శంకరసముద్రం, సరళాసాగర్లోనూ నీటినిల్వలు అడుగంటడంతో ఆయకట్టు రైతులకు సాగు కష్టాలు నెలకొన్నాయి. వీటికితోడు గ్రామాల్లోని చెరువులు, కుంటలు సైతం ఎండుముఖం పట్టడంతో బోరుబావుల్లో నీటిమట్టం తగ్గి ఆపి ఆపి నీటిని బయటకు వదులుతున్నాయి.
మండలం కనెక్షన్ల సంఖ్య
పాన్గల్ 7,775
వీపనగండ్ల 5,781
గోపాల్పేట 5,638
పెద్దమందడి 5,136
చిన్నంబావి 4,926
ఖిల్లాఘనపురం 4,716
వనపర్తి టౌన్ 4,958
కొత్తకోట 4,848
పెబ్బేరు 4,070
రేవల్లి 3,612
అమరచింత 3,469
మదనాపురం 3,021
ఆత్మకూర్ 3,054
శ్రీరంగాపురం 2,353
వనపర్తి 878
రోజు సాయంత్రం 5.30 గంటలకు త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్న అధికారులు అర్ధరాత్రి 3, 4 గంటల సమయంలో వదులుతుండటంతో రైతులు పొలాల జాగారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదేమిటని ట్రాన్స్కో అధికారులను ప్రశ్నించినా స్పందించడం లేదని.. తప్పరి పరిస్థితుల్లో ఉన్న సమయంలో నే పొలాలకు నీటిని వదులుతున్నామని చెబుతున్నారు. ఈసారి ఎల్నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవక జలాశయాలు నిండక విద్యుదుత్పత్తి ప్రశ్నార్థకంగా మారింది. విద్యుదుత్పత్తి లేకపోవడం, ఉన్న విద్యుత్ను సద్వినియోగం చేసుకొనేందుకు అప్రకటిత కోతలు విధించాల్సి వస్తోందని ట్రాన్స్కో అధికారులు తెలిపారు.


