వనపర్తి: పోలీసు సిబ్బంది క్రమశిక్షణ, పారదర్శకతతో పనిచేస్తూ ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని.. ప్రతి పని సమయానికి పూర్తి చేయడంతో పోలీసుశాఖపై ప్రజల నమ్మకం మరింత పెరుగుతుందని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సిబ్బందితో ఎస్పీ ప్రత్యేక సమీక్ష నిర్వహించి పనితీరును ప్రశంసిస్తూ మరింత సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. స్పెషల్ బ్రాంచ్ విభాగం జిల్లా పోలీస్ వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తోందని.. క్షేత్రస్థాయిలో సిబ్బందికి అవసరమైన సమాచారాన్ని అందిస్తూ నేర నియంత్రణలో ముఖ్యమైన సహకారం అందిస్తోందని తెలిపారు. పాస్పోర్ట్, ఉద్యోగ వెరిఫికేషన్ ప్రక్రియ, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ల జారీ ఇతర విభాగాలకు సమన్వయంతో సహకారం అందించడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, ఎస్ఐలు మంజునాథ్రెడ్డి, నరేష్, పర్వతాలు, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
నిందితులకు శిక్ష పడేలా చూడాలి..
కోర్టు కేసుల్లో శిక్షల శాతాన్ని పెంచడం, తప్పుచేసిన వారికి శిక్ష పడేలా చేయడంతో ప్రజలకు పోలీసుశాఖపై మరింత గౌరవం, నమ్మకం పెరుగుతుందని ఎస్పీ సునీతరెడ్డి అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో కోర్టు లైజన్, కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నిందితులకు శిక్షలు పడినప్పుడే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని, ఇందుకుగాను కేసులు పెండింగ్లో లేకుండా చూసుకోవాలన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు నుంచి కేసు పూర్తయ్యే వరకు అవసరమైన రుజువులు, పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించడంలో కోర్టు పోలీసు అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని సూచించారు. బాధితులు, సాక్షులకు కేసుకు సంబంధించిన విషయాల్లో అవగాహన కల్పించాలని.. ప్రాసిక్యూషన్కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ఎస్ఐలకు తెలియజేయాలన్నారు. పలువురు కోర్టు కానిస్టేబుళ్లతో మాట్లాడి కేసుల పురోగతిపై ఆరా తీశారు. సమావేశంలో డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి, జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.


