అమరచింత: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సృజన ఆరోపించారు. భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా మూడో మహాసభలు సోమవారం పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై సంఘం జెండాను ఎగురవేసి మాట్లాడారు. డీలిమిటేషన్ లింకుతో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టకపోవడాన్ని పూర్తిగా వ్యతిరేస్తున్నామన్నారు. బిల్లు అమలు బీజేపీకి ఏ మాత్రం ఇష్టం లేదని స్పష్టం చేశారు. దేశంలో మహిళలపై అనేక అఘాయిత్యాలు, ధౌర్జన్యాలు, హత్యలు జరుగుతున్నా ప్రధాని నరేంద్రమోదీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తగదన్నారు. మహిళలు లేనిదే దేశంలో ఏ కార్యక్రమం లేదని.. మహిళలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమై ఆ పార్టీని గద్దెదించాలని పిలుపునిచ్చారు. మహబూబ్నగర్, వనపర్తి జిల్లా అధ్యక్షులు పద్మ, కృష్ణవేణి, జిల్లా కార్యదర్శి సీత మ్మ, నాయకులు జయమ్మ, కళావతమ్మ, పద్మ, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, మండల కార్యదర్శి అబ్రహం, పట్టణ కార్యదర్శి రవీందర్ పాల్గొన్నారు.


