వనపర్తిటౌన్: జిల్లాలోని కేజీబీవీల్లో ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు ఇన్చార్జ్ డీఈఓ యాదయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐఓఈ స్కూల్స్లోని అమరచింత కేజీబీవీలో ఎంపీసీ, బైపీసీలో 2 చొప్పున, వనపర్తి కేజీబీవీలో ఎంపీసీలో 7, గోపాల్పేట కేజీబీవీలో ఎంపీసీలో 3 సీట్లు, శ్రీరంగాపూర్ కేజీబీవీ ఎంపీసీలో 10, ఆత్మకూర్లోని కేజీబీవీ సీఈసీలో 7, రేవల్లిలో 10, పెద్దమందడిలో ఎంఎల్టీలో 5, ఖిల్లాఘనపురంలో కంప్యూటర్ సైన్స్లో 3, పాన్గల్లో కంప్యూటర్ సైన్స్లో 4, కొత్తకోటలో అకౌంట్ అండ్ ట్రాన్సాక్షన్లో 5, మదనాపురంలో ఫార్మా అండ్ టెక్నాలజీలో 15, ఖిల్లాఘనపురం (జనరల్) కేజీబీవీలో కమర్షియల్ గార్మెంట్ అండ్ టెక్నాలజీ కోర్సులో 25 సీట్లు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. ఆసక్తిగల విద్యార్థులు స్పాట్ అడ్మిషన్స్ ద్వారా ప్రవేశాలు పొందాలని సూచించారు. గురువారం నుంచి 18వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్స్కు అవకాశం ఉంటుందని, విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నాయకుల
అరెస్టులు అప్రజాస్వామికం
వనపర్తి రూరల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి పాలమూరులో పర్యటించిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు, ప్రజా ప్రతినిధులను ముందస్తు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. ప్రతిపక్ష నేతలను, ప్రశ్నించే వారిని అరెస్టు చేస్తేగాని క్షేత్రస్థాయిలో తిరగలేని దుస్థితిలో సీఎం రేవంత్తెడ్డి ఉన్నారా.. ప్రజాపాలన అంటే ప్రజలను నిర్భందించడమేనా.. అని ప్రశ్నించారు. తన పాలన మీద తనకే నమ్మకం లేని వ్యక్తి సీఎంగా ఎలా కొనసాగుతారని ఎద్దేవా చేశారు. పోలీసుల పహారా మధ్య ప్రజాపాలన సాగుతుందని, రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్గాంధీకి రాష్ట్రంలో రేవంత్ అరాచకాలు కనిపించకపోవడం విస్మయానికి గురి చేస్తుందన్నారు. ఇలాగే కొనసాగితే కాంగ్రెస్కు ప్రజలే బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు.
వర్షాల కోసం
తీరొక్క మొక్కులు
కొల్లాపూర్/పెద్దకొత్తపల్లి: వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా వరుణుడి జాడే లేకుండాపోయింది. అప్పుడప్పుడు అరకొరగా కురిసిన వర్షాలకు రైతులు సాగుచేసిన పంటలు ఎండుమఖం పడుతున్నాయి. వ్యయ, ప్రయాసలకోర్చి సాగుచేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు వర్షాల కోసం ఆకాశంవైపు ఆశగా ఎదురుచూస్తూ.. తీరొక్క మొక్కులు మొక్కుకుంటున్నారు. బుధవారం పెంట్లవెల్లి మండలం గోపులాపురం శివాలయంలో గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి.. పరమశివుడిని జలదిగ్బంధనం చేశారు. పెద్దకొత్తపల్లి మండలం చంద్రబండ తండాలో మహిళలు కప్పల కావడి నిర్వహించారు. కప్పల కావడితో వాడవాడ తిరుగుతూ వానమ్మా.. వానమ్మ ఒక్కసారన్నా వచ్చి పోవమ్మా అంటూ పాటలు పాడారు.
లొద్ది మల్లయ్య దర్శనానికి అనుమతివ్వాలి
అచ్చంపేట: ఈ నెల 25న తొలి ఏకాదశి సందర్భంగా నల్లమల అటవీ ప్రాంతంలోని లొద్ది మల్లయ్య దర్శనానికి అనుమతించాలని భజరంగ్దళ్ నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్చంద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నల్లమల ప్రాంత ప్రజలతో పాటు ఆదివాసీ చెంచుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు లొద్ది మల్లయ్య ఆలయం ప్రతీకగా నిలిచిందన్నారు. ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి సందర్భంగా చెంచు పూజారుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ ఏడాది కూడా అటవీశాఖ అనుమతులు ఇచ్చి.. భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో భజరంగ్దళ్ డివిజన్ కన్వీనర్ సీతారాల శివచంద్ర, చందులాల్ చౌహాన్, శివాజీ, నరేశ్, చందర్, అజయ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.


