కొత్తకోట రూరల్: పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరైన సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ డి.సునీతారెడ్డి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ ఒకరు, డీఎస్పీలు నలుగురు, సీఐలు 16 మంది, ఎస్ఐలు 54 మంది, ఏఎస్లు, హెడ్ కానిస్టేబుల్స్ 181, మహిళా కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ 595 మంది కలిపి మొత్తం సుమారు 850 మంది పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి సాయంత్రం 4:49 గంటలకు కొత్తకోటకు చేరుకోగా.. ఆయన రాకకు గంట ముందే పట్టణంలోని ప్రధాన రహదారులను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని ట్రాఫిక్ను నిలిపివేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వనపర్తి, ఆత్మకూరు మార్గంలో ప్రయాణించే వాహనాలను సంకిరెడ్డిపల్లి స్టేజీ వద్ద నిలిపివేయడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. పాఠశాల భవన ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కానాయపల్లిలోని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్రెడ్డి నివాసానికి వెళ్లి తేనేటి విందులో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా హెలిప్యాడ్ దగ్గరకు చేరుకుని సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్కు బయలుదేరారు. ముఖ్యమంత్రి పర్యటన ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు, జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


