వనపర్తి రూరల్: దత్తాయిపల్లి గ్రామ అభివృద్ధికి రూ.7 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని దత్తాయిపల్లిలో రెండు అంగన్వాడీ భవనాలు, పంచాయతీ భవనం, గోదాంల నిర్మాణం, ఆంజనేయ ఆలయ నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ఇంటి యజమానులకు నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిందన్నారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు రహదారులు, ప్రభుత్వ భవనాలు, తాగునీరు, విద్యుత్, ఇతర ప్రజావసరాల కల్పనకు ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటయ్య, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, శంకర్నాయక్, సింగిల్ విండో అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, ఉప సర్పంచ్ కిషన్నాయక్ నాయకులు అధికారులు పాల్గొన్నారు.


