వనపర్తి విద్యావిభాగం: ఉపాధ్యాయులు, విద్యాశా ఖ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీపీయూఎస్ రాష్ట్రశాఖ పిలుపు మేరకు సోమవారం జిల్లాకేంద్రంలోని మర్నికుంట ధర్నా చౌక్లో సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేసి 51 శాతం పీఆర్సీ ప్రకటించాలని, సీపీఎస్ను రద్దు చేసి పాత పింఛన్ విధానం అమలు చేయాలని కోరారు. జీఓనంబర్ 317 బాధితులకు న్యాయం చేయాలని, జీఓనంబర్ 25 రద్దు, 2010కు ముందు నుంచి విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు, కేజీబీవీ, ఎస్ఎస్ఏ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన గ్రాంట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


