జిల్లాలో ఏటా పెరుగుతున్న మిస్సింగ్ కేసులు
● మూడున్నర ఏళ్లలో 919 కేసులు నమోదు
● దర్యాప్తు చేసినవి 872
● ఫిర్యాదుకు రాని కేసులు మరెన్నో..
‘వనపర్తి మండలం అంకూరుకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల భార్యతో విభేదించి
ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. మూడురోజుల పాటు కాలినడకన ఎక్కడెక్కడో తిరిగి చివరకు పెద్దగూడెం క్రాస్ రోడ్ సమీపంలో ఓ చెట్టుకు ఉరేసుకొని మృతిచెందాడు. పోలీసులు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడి సెల్ఫోన్ సిగ్నల్స్ను పరిశీలించగా.. రాణిపేట, కొత్తకోట తదితర ప్రాంతాల్లో తిరిగినట్లుగా గుర్తించారు. జిల్లావ్యాప్తంగా నమోదవుతున్న మిస్సింగ్ కేసుల్లో వనపర్తిటౌన్, రూరల్ పోలీస్స్టేషన్లలో అధికంగా ఉన్నట్లు అఽధికారులు వెల్లడించిన లెక్కలతో తెలుస్తోంది.’
వనపర్తి: జిల్లాలో ఏటా అదృశ్యం (మిస్సింగ్) కేసుల సంఖ్య పెరుగుతుండగా.. అందులోనూ మహిళలు, యువతులు, మైనర్లే అత్యధికంగా నమోదు కావడం శోచనీయం. కేసుల విచారణలో అధికంగా క్షణికావేశానికి లోనై ఇళ్లు వదిలి వెళ్తున్న సంఘటనలు ఉండగా.. మరికొన్ని కేసులు మూడేళ్లవుతున్నా నేటికీ ఆచూకీ లభించనివి ఉన్నాయి. ఇంకొన్ని ప్రాణాలతో ఇంటి నుంచి వెళ్లి విగతజీవిగా ఇంటికి తిరిగి వస్తున్న ఘటనలు ఉన్నాయి. ఇటీవల పిల్లల అదృశ్యం కేసుల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా నమోదవుతున్న మిస్సింగ్ కేసులు వాటిలో మహిళలు, మైనర్లు, ముఖ్యంగా చిన్నారుల మిస్సింగ్లపై రాష్ట్ర పోలీస్బాస్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నిత్యం భరోసా కేంద్రం ఆధ్వర్యంలో జీవన విధానంపై గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. ఘటనలు ఆగకపోవడం శోచనీయం.
ఏడాది మిస్సింగ్ కేసులు మైనర్ల మొత్తం
మహిళలు/
యువతులు
2023 183 18 233
2024 215 34 300
2025 219 58 322
2026 58 19 64
అభద్రతలో ‘ఆమె’..
జిల్లాలో మూడున్నరేళ్లలో నమోదైన మిస్సింగ్ కేసులు పరిశీలించగా.. మహిళలు, యువతులే అత్యధికంగా ఉండటం గమనార్హం. ఇంటిని చక్కబెట్టే మహిళలు, కుటుంబ పరువుగా భావించే యువతుల మిస్సింగ్ కేసులు పెరగడానికి ప్రధాన కారణం ఉమ్మడి కుటుంబాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడమేనని పలువురు సీనియర్ సిటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
47 కేసులు పెండింగ్..
జిల్లావ్యాప్తంగా గడిచిన మూడున్నర ఏళ్లలో 919 మిస్సింగ్ కేసులు నమోదుకాగా.. 872 కేసులను పోలీసు ఛేదించారు. మరో 47 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో 2023 నాటి కేసులు 6, 2024 కేసులు 8, 2025 కేసులు 22, తాజాగా 2026లో ఇప్పటి వరకు కేసులు 19 ఉన్నాయి.
సాంకేతికతతో ఛేదిస్తున్నాం
జిల్లాలో నమోదవుతున్న మిస్సింగ్ కేసులను మా అధికారుల బృందం ఆధునిక సాంకేతికతను వినియోగించి సెల్ టవర్ సిగ్నల్ ఆధారంగా ఛేదిస్తున్నారు. పెండింగ్లో ఉన్న కేసులను వీలైనంత త్వరగా ఛేదించాలని ఆదేశాలిచ్చాం. నిరంతరం స్టేషన్ల వారీగా రివ్యూ చేస్తున్నాం. క్షణికావేశంలో ఇంటి నుంచి వెళ్తున్న వారికి కౌన్సెలింగ్ ఇచ్చి తిరిగి పంపిస్తున్నాం. – సునీతారెడ్డి,
ఎస్పీ
ఏడాది వారీగా నమోదైన మిస్సింగ్ కేసులు


