సాలూరు: టీడీపీ నేతల ప్రలోభాలకు, ఒత్తిడులకు భయపడేది లేదని.. ప్రాణం పోయేవరకూ వైఎస్సార్సీపీతోనే ఉంటామని గిరిజన నాయకులు స్పష్టం చేశారు. మండలానికి చెందిన మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, ముఖ్య నాయకులు మండలంలోని తోణాం సమీపంలో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరను ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలువురు గిరిజన నాయకులు మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల నుంచి టీడీపీలోకి చేరికలు జరుగుతున్నాయంటూ వస్తున్న ప్రచారాల్లో వాస్తవం లేదన్నారు. టీడీపీలోకి వస్తే రుణాలు ఇప్పిస్తామని, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందిస్తామని టీడీపీ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ ఎవ్వరం పార్టీ మారబోమని స్పష్టం చేశారు. ఎక్కడో ఒకరిద్దరు ఒత్తిడికి భయపడి పార్టీ మారితే.. వందల సంఖ్యలో చేరినట్లు టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు. గిరిజనులమంతా ఐక్యంగా ఉండి వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేస్తామన్నారు. అనంతరం రాజన్నదొర మాట్లాడుతూ.. నేటి ఆధునిక సమాజంలో గిరిజనులను ఎవ్వరు బెదిరించలేరని.. ఒకవేళ ఎవరైనా బెదిరించాలనుకున్నా భయపడేవారే లేరన్నారు. గిరిజనులకు వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. టీడీపీ మోసపూరిత హామీలతో గిరిజనులను మోసం చేస్తే, వైఎస్సార్సీపీ సంక్షేమ పథకాలతో అండగా నిలిచిందని చెప్పారు. డీఎస్సీపై చర్చకు బాధిత అభ్యర్థులే సిద్ధంగా ఉన్నారని, వారితో చర్చకు వెళ్లి టీడీపీ నాయకులు తమ చిత్దశుద్ధి నిరూపించుకోవాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు మువ్వల ఆదయ్య, దండి శ్రీనివాసరావు, చోడిపల్లి బీసు, గమ్మెల బీసు, కొండపల్లి సింహాచలం, రాజారావు, గమ్మెల సుబ్బు, నెమలిపిట్ట కల్యాణ్, కొండగొర్రి ఉదయ్, జయసింహ, తదితరులు పాల్గొన్నారు.
ప్రాణం పోయే వరకూ వైఎస్సార్సీపీతోనే ఉంటాం
స్పష్టం చేసిన గిరిజన ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు
గిరిజనులకు అండగా ఉంటాం: మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర


