● కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య 10వేలకు
పెంచాలంటూ ఆందోళన
విజయనగరం: ఎన్నికలకు ముందు లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తాం... ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం.. జాబ్ వచ్చేవరకు నిరుద్యో గభృతి కింద నెలకు రూ.3వేలు చెల్లిస్తామన్నారు.. రెండేళ్లుగా మొండి చేయి చూపుతున్నారంటూ చంద్రబాబు సర్కారుపై నిరుద్యోగులు నిప్పులుచెరిగారు. ఏపీ నిరుద్యోగ, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం విజయనగరం జిల్లా కేంద్రంలో ఆందోళన చేశారు. పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీచేయాలని, పోస్టుల సంఖ్యను 10 వేలకు, వయోపరిమితిని 35 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. కోట కూడలిలో ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ రామచంద్ర మాట్లాడుతూ తాజాగా కేవలం 2,500 పోలీసు ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తామని హోం మంత్రి అనిత ప్రకటించడం నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. రాష్ట్రంలో 19,999 పోలీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, పోలీస్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని హోంమంత్రి స్వయంగా అసెంబ్లీలో చేసిన ప్రకటనను గుర్తుచేశారు. వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ, అన్ని కేటగిరీలు కలుపుకొని కేవలం 2,500 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించడం సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న నిరుద్యోగ యువత పాల్గొన్నారు.


