● 150 అడుగుల పతాకంతో స్వాతంత్య్ర ర్యాలీ
● పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
విజయనగరం గంటస్తంభం/టౌన్/క్రైమ్:
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు విజయనగరం ముస్తాబైంది. జిల్లా కేంద్రంలో శుక్రవారం సాగిన 150 అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శన దేశభక్తిని చాటింది. మన దేశం–మన బాధ్యత నినాదంతో సాగిన ర్యాలీని రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురజాడ అప్పారావు చెప్పిన దేశమంటే మట్టి కాదోయ్..దేశమంటే మనుషులోయ్ స్ఫూర్తి వ్యాక్యాన్ని వినిపించారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాల సాధనకు సమష్టిగా కృషి చేయాలని కోరారు. స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను స్మరించుకోవాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి సూచించారు. దేశానికి యువతే వెన్నెముక అని, దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. కార్యక్రమంలో డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, ఆర్డీఓ సుధాసాగర్, మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాణి, డీఎస్డీఓ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


