విజయనగరం: వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించనున్నట్టు జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 8.30 గంటలకు దాసన్నపేట రింగ్రోడ్డు కూడలిలోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొనాలని కోరారు.
గవర్నర్ ఎట్ హోమ్కు ఆహ్వానం
విజయనగరం గంటస్తంభం: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని లోక్భవన్లో గవర్నర్ నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరికి ప్రత్యేక ఆహ్వానం లభించింది. పర్యావరణ పరిరక్షణలో విశేష కృషి చేసిన ఫారెస్ట్ రేంజ్ అధికారి బిర్లంగి రామనరేష్, ఒలింపిక్స్ విజేతల విభాగంలో వల్లూరి అజయ్బాబుకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపిక చేశారు. ఆగస్టు 15న సాయంత్రం 4 గంటలకు లోక్భవన్లో జరిగే ఎట్హోమ్ కార్యక్రమానికి వీరిద్దరూ హాజరుకానున్నారు.
యువత భవితకు
‘మై భారత్’ బాట
విజయనగరం గంటస్తంభం: యువత ఉజ్వల భవిత కోసం మై భారత్ పోర్టల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కల్పిస్తోందని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) సత్తిబాబు తెలిపారు. కలెక్టరేట్లో మై భారత్ జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మై భారత్ జిల్లా యువజన అధికారి ప్రేమ్ భరత్కుమార్ జిల్లాలో చేపడుతున్న యువజన కార్యక్రమాలను వివరించారు. జిల్లాలోని యువతీయువకులు మై భారత్ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకుని, నైపుణ్యాభివృద్ధి, ఇతర అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


