● సర్వజన ఆస్పత్రి సూపరింటిండెంట్ పద్మజ
విజయనగరం ఫోర్ట్: ధీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, కొలెస్ట్రాల్ సమస్యలు, హైపో థైరాయిడిజం వంటి మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నవారిలో ఫ్యాటీ లివర్, కాలేయ ఫైబ్రోసిస్ వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటిండెంట్ అల్లు పద్మజ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ‘మెటబాలిక్ సిండ్రోమ్ – ఫ్యాటీ లివర్’పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. ఫైబ్రోస్కాన్ ద్వారా కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం, ఫైబ్రోసిస్ స్థాయిని అంచనా వేయవచ్చునని తెలిపారు. ఫ్యాటీలివర్ను కేవలం కాలేయానికి సంబంధించిన వ్యాధిగా మాత్రమే చూడకూడదన్నారు. మెటబాలిక్ సిండ్రోమ్ చికిత్సలో ఫిజీషియన్ పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. బీపీ, సుగర్, థైరాయిడ్, ఊబకాయం, ఫ్యాటీలివర్ ఉన్నవారు కాలేయ ఆరోగ్యంతో పాటు మొత్తం మెటబాలిక్ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. కార్యక్రమంలో జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ సుదర్శి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీసౌజన్య, జనరల్ సర్జరీ విభాగం వైద్యులు చైతన్యబాబు, డాక్టర్ వెంకటనాయుడు, డాక్టర్ హర్షవర్థన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


