విజయనగరం గంటస్తంభం: జంతు సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసేందుకు గాను ప్రతి నియోజకవర్గంలో జంతు ఆశ్రమం నెలకొల్పాలని జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు ఆదేశించారు. శుక్రవారం స్థానిక డీఆర్ఓ చాంబర్లో జిల్లా స్థాయి ఎస్పీసీఏ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జంతు హింసకు చెక్ పెట్టాలన్నారు. ఈ మేరకు పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. వీబీ జీ రామ్ జీ పథకంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో జంతు ఆశ్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. రక్షించిన జంతువులకు ఆహారం, వైద్యం, పునరావాసం కల్పించేలా షెల్టర్లను అభివృద్ధి చేయాలని సూచించారు. పోలీస్, పశుసంవర్థక, రవాణా, మున్సిపల్, పంచాయతీ శాఖల సమన్వయంతో పశువుల అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. పాఠశాలల్లో యానిమల్ కై ండ్నెస్ క్లబ్స్ ఏర్పాటు చేసి విద్యార్థుల్లో జంతువుల పట్ల దయ, కరుణ ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో పశుసంవర్థక శాఖ జేడీ డా.ఎస్.మన్మధరావు, జెడ్పీ సీఈఓ ఎ.లవరాజు, డీపీఓ డీవీ మల్లికార్జునరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కె.సాంబమూర్తి, బొబ్బిలి డీఎస్పీ ఆర్.గోవిందరావు, డీఈఓ, సూపరింటిండెంట్ ఎస్.సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు


