విజయనగరం అర్బన్: ఐదు రోజుల పనిదినాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్బీయూ) పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఎస్బీఐ కోట బ్రాంచ్ వద్ద బుధవారం బ్యాంక్ ఉద్యోగులు, నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. 12వ బైపార్టెడ్ సెటిల్మెంట్లో కుదిరిన ఒప్పందం ప్రకారం వారానికి 5 రోజుల పనిదినాల నిబంధనను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్యక్రమంలో విజయనగరం జిల్లా యూఎఫ్బీయూ కన్వీనర్ మురళీశ్రీనివాస్, జిల్లా బ్యాంక్ ఎంప్లాయీస్ కో–ఆర్డినేషన్ కమిటీ ప్రెసిడెంట్ బీవీప్రసాద్, ఎస్బీఐ ఉద్యోగుల సంఘం రీజినల్ సెక్రటరీ ఎం.రమేష్కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఐవీరమణమూర్తి, అమరావతి సర్కిల్ ఓబీసీ అసోషియేషన్ ప్రెసిడెంట్ పి.సంతోష్కుమార్, వివిధ బ్యాంకులకు చెందిన నాయకులు శ్రవణ్కుమార్, భానోజీరావు, రవికుమార్, అశోక్ నాయక్, నాగభూషణరావు, శ్రీనివాస్ రావు, చిన్నారావు, మనోజ్ వర్మ, అచ్యుత్, మురళి తదితరులు పాల్గొన్నారు.


