● గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో
72 షాపుల ఏర్పాటు
● ప్రోత్సాహం లేకపోవడంతో దాదాపు
20 షాపులు మూత
విజయనగరం ఫోర్ట్: నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం, చేపల వినియోగం పెంచాలన్న ఉద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర షాపులను ఏర్పాటు చేసింది. వీటిపై రెండేళ్లుగా కూటమి సర్కారు నిర్లక్ష్యం చూపుతోంది. కొత్త షాపుల ఏర్పాటుకు ప్రోత్సాహం లేదు. ఉన్నదుకాణాలు మూతపడుతున్నా పట్టించుకోవడం లేదు. జిల్లాలో సముద్రతీర ప్రాంతం 24 కిలోమీటర్లు ఉంది. మైదాన ప్రాంతంలో చెరువులు, సాగునీటి ప్రాజెక్టులు అధికంగానే ఉన్నాయి. చేపలవేటే ఆధారంగా మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. వీరు వేట సాగించిన చేపలు దళారులకు తక్కువ ధరకే అమ్మేవారు. దీనికి చెక్చెబుతూ మత్స్యకారులే చేపల విక్రయించుకునేందుకు వీలుగా గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర షాపులను అందుబాటులోకి తెచ్చింది. స్థలంతోపాటు దుకాణాల ఏర్పాటుకు నిర్వాహకుడు 10 శాతం చెల్లిస్తే 40 శాతం రాయితీ, 50 శాతం బ్యాంకు రుణం కింద ఆర్థిక సాయం అందజేసేది. దీనివల్ల అటు మత్స్యకారులు చేపలు విక్రయించుకునేందుకు అవకాశం ఉండేది. ఇటు వినియోగదారులకు తక్కువ ధరకే చేపలు లభించే పరిస్థితి.
జిల్లాలో 72 షాపుల ఏర్పాటు...
జిల్లాలో 72 ఫిష్ ఆంధ్ర షాపులను గత ప్రభుత్వ హయాంలో మత్స్యకారులు ఏర్పాటుచేశారు. రూ.60 వేలు నుంచి రూ.3.30 లక్షల యూనిట్ విలువ కలిగిన షాపులు ఉన్నాయి. ఈ షాపుల ఏర్పాటుకు అప్పట్లో ప్రభుత్వం రూ.40 లక్షల వరకు రాయితీ ఇచ్చింది. అయితే, టీడీపీ సర్కార్ ఫిష్ ఆంధ్రషాపుల నిర్వహణను పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని మత్స్యశాఖ డీడీ లావణ్య వద్ద ప్రస్తావించగా గతంలో 72 ఫిష్ఆంధ్ర దుకాణాలు ఉండేవని, ఇప్పుడు 15 నుంచి 20వరకు మూతపడ్డాయన్నారు.


