దిశ బిల్లు ఉపసంహరణపై మండిపడ్డ ఏయూ విద్యార్థినులు
మహిళల భద్రతపై బాధ్యత లేదా?
రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో చట్టాలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ‘దిశ’ వంటి బిల్లును చట్టంగా మార్చేందుకు కృషి చేసి, పకడ్బందీగా అమలు చేయాల్సింది పోయి రద్దు చేయాలనుకోవడం మంచి నిర్ణయం కాదు. ఈ కోపం మహిళలపైనా, లేక గత ప్రభుత్వంపైనా? ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. మహిళలను కాపాడుకోవడం అందరి బాధ్యత. –ఎ.హర్షిత, ఏయూ విద్యార్థిని
ప్రభుత్వం పునరాలోచించాలి
దిశ బిల్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మహిళా భద్రతకు పెద్దపీట వేసేలా గత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేదు, నిబద్ధత మాత్రమే ఉంది. ఆ చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం కృషి చేయాలి తప్ప, రద్దు చేయాలనుకోవడం సరికాదు. ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచించాలి.
–పి.భారతి, ఏయూ ఆర్ట్స్ విద్యాఽర్థి
విశాఖ విద్య: మహిళల భద్రత కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దిశ బిల్లు’ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడంపై మహిళలు, ముఖ్యంగా విద్యార్థినుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన పలువురు విద్యార్థినులు చంద్రబాబు సర్కారు తాజా నిర్ణయాన్ని తప్పుబట్టారు. చట్టాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయడానికి కృషి చేయకుండా, అసలు దిశ చట్టం ఆలోచననే రద్దు చేయాలనుకోవడం అసంబద్ధ చర్య అని దుయ్యబట్టారు.


