డాబాగార్డెన్స్: హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన జగన్నాథస్వామి రథయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు సంస్థ ఉపాధ్యక్షుడు యదురాజ దాస తెలిపారు. మంగళవారం వీజేఎఫ్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కార్యక్రమ వివరాలను వెల్లడించారు.రోజు సాయంత్రం 4 గంటలకు ఎంవీపీ కాలనీ డబుల్ రోడ్డులోని ఐఐఏఎం కళాశాల నుంచి సంప్రదాయ పద్ధతిలో రథయాత్ర ప్రారంభమవుతుం దని చెప్పారు. ఈ యాత్ర ఎంవీపీ డబుల్ రోడ్డు నుంచి ఇసుకతోట జాతీయ రహదారి, వెంకోజీపాలెం, క్యాన్సర్ ఆస్పత్రి, బీచ్ రోడ్డు అప్పుఘర్ మీదుగా తిరిగి ఐఐఏఎం కళాశాల వరకు కొనసాగుతుందన్నారు. యాత్ర అనంతరం రాత్రి 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, బడే రాణి నేతృత్వంలో రాధాకృష్ణ డ్యాన్స్ అకాడమీ ప్రతినిధులచే భరతనాట్య ప్రదర్శన ఉంటాయని వివరించారు. రాత్రి 8 గంటలకు జగన్నాథ మంగళహారతి, అనంతరం భక్తులకు మహాప్రసాద వితరణ జరుగుతుందని తెలిపారు. హరేకృష్ణ మూవ్మెంట్ అధ్యక్షుడు డాక్టర్ నిష్కించన భక్త దాస నేతృత్వంలో జరిగే ఈ రథయాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని యదురాజ దాస కోరారు.


