ఆరిలోవ : కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ ఖైదీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. జైలు అధికారుల ఫిర్యాదు మేరకు ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరిలోవ సీఐ ఎస్. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన సొండి చిన్న అప్పలస్వామి (57)కు ఓ నేర కేసులో 2024 ఆగస్టులో కోర్టు జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి ఆయన విశాఖ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. సోమవారం ఉదయం ఆయన అస్వస్థతకు గురికావడంతో జైలు వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి తర్వాత మృతి చెందాడు. జైలర్ ఎ. ఈశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.


