అన్నవరం: విజయవాడ నుంచి విశాఖ వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో గుర్తు తెలియని ప్రయాణికుడు మంగళవారం మధ్యాహ్నం అన్నవరం సమీపంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే విశాఖ మధురవాడ డిపోకు చెందిన విజయవాడ–విశాఖ సూపర్ లగ్జరీ బస్సులో విజయవాడ నుంచి విశాఖకు వెళ్తున్న వ్యక్తి కత్తిపూడి వద్ద తన సీటులో వాలిపోయాడు. ఈ విషయాన్ని ఇతర ప్రయాణికులు డ్రైవర్ దృష్టికి తీసుకురాగా ఆయన 108కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి అన్నవరం వద్ద ఆ వాహనంలోకి అతడిని ఎక్కించే ప్రయత్నం చేయగా అప్పటికే అతడు మృతి చెందినట్టు సిబ్బంది తెలిపారు. దాంతో మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని వద్ద రూ.200 తప్ప మరే ఇతర గుర్తింపు కార్డులు లేకపోవడంతో అక్కడి ఆస్పత్రి మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచారు. అన్నవరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


