పరిగి: రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతులకు ఉచితంగా కంది, పెసర విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. సబ్సిడీపై పనిముట్లు, ఉచితంగా విత్తనాలు ఇస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రైతులకు చేసిందేమీ లేదని ఆరోపించారు. ఒక్క పనిముట్టు కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ వచ్చాకే అనేక పథకాలు పొందుతున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వమన్నారు. అనంతరం పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రజిత, పీఏసీఎస్ చైర్మన్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కుల్కచర్ల: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి సూచించారు. మంగళవారం కుల్కచర్లలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు బాధ్యతగా పని చేసినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అనంతరం పీరంపల్లి సర్పంచ్ వెంకటయ్య మాట్లాడుతూ.. అటవీ ప్రాంతంలో కొందరు టేకు చెట్లను నరుకుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ట్రాన్స్ఫార్మర్ కోసం మూడేళ్ల క్రితం డీడీ కట్టినా ఇంతవరకు ఏర్పాటు చేయలేదని చెరువుముందలి తండా(ఏ) సర్పంచ్ రవి సభ దృష్టికి తెచ్చారు. రోడ్డు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పటేల్ చెరువు తండా సర్పంచ్ శాంతిబాయిలు తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే ప్రజా సమస్యలను తన దృష్టికి తెస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమస్యలపై అధికారులు కూడా సత్వరం స్పందించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ పురుషోత్తం, ఎంపీడీఓ రామకృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి
రైతులకు కంది, పెసర విత్తనాల పంపిణీ


