మోమిన్పేట: అనుమానాస్పదంగా యువకుడు మృతి చెందిన సంఘటన మోమిన్పేటలో చోటు చేసుకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి టేకులపల్లి గ్రామానికి చెందిన అంతగళ్ల లక్ష్మయ్య(35), అదే గ్రామానికి చెందిన కుమార్, ప్రభాకర్లు కలిసి శుక్రవారం మధ్యాహ్నం సమీపంలోని రాళ్లగుడుపల్లి క్వారీలో ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో లక్ష్మయ్య నీటి లోపలికి వెళ్లి ఎంతకూ రాలేదు. దీంతో మిగతా ఇద్దరు నీటి లోపలికి వెళ్లి లక్ష్మయ్యను వెలికితీయగా.. అతను అప్పటికే చనిపోయాడు. భయాందోళన చెందిన సదరు వ్యక్తులు.. అక్కడి నుంచి బైక్పై శవాన్ని తీసుకెళ్లి, మోమిన్పేట నుంచి ఎన్కతలకు వెళ్లే మార్గంలో ఓ పొలం వద్ద ఉంచారు. కుమార్ పోలీస్స్టేషన్లో సమాచారం ఇచ్చాడు. తొలుత తాగిన మైకంలో అతని మాటలను పోలీసులు నమ్మలేదు. తరువాత గ్రామస్తుల ద్వారా ఈతకు వెళ్లిన విషయం తెలుసుకొని, ఘటనా స్థలికి వెళ్లి చూడగా.. శవం కనిపించలేదు. పోలీసులు వచ్చే సరికే కుమార్, ప్రభాకర్లు శవాన్ని అక్కడి నుంచి రామమ్మ బావి వెనకాల గుట్ట వద్ద వేసి పరారయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తమ్ముడు నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భరత్భూషన్ తెలిపారు.


