తాండూరు టౌన్: సాధారణంగా ఏ కార్యక్రమానికై నా ఎమ్మెల్యేలు, మంత్రులు, అతిథులు కొంత ఆలస్యంగా రావడం తరచూ చూస్తుంటాం. కానీ స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో శనివారం సీన్ రివర్స్ అయ్యింది. స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని కళాశాలలో ఉదయం 9గంటలకు జెండావిష్కరణ చేసిన అనంతరం విద్యార్థులు ఎమ్మెల్యేకు గౌరవ వందనం చేయాల్సి ఉంది. సమయానికి ఎమ్మెల్యే మనోహర్రెడ్డి అక్కడికి చేరుకున్నా అధికారులు, సిబ్బందితో పాటు విద్యార్థులెవరూ రాలేదు. దీంతో ఎమ్మెల్యే వేచిచూడాల్సి వచ్చింది. ఈ ఘటనపై ఎమ్మెల్యే అసహనానికి గురవడంతో పాటు అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది.
బషీరాబాద్: జిల్లా ఉత్తమ అధికారిగా తహసీల్దార్ షాహేదాబేగం ఎంపికయ్యారు. శనివారం వికారాబాద్లో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు హాజరు కాకపోవడంతో ఆమె ప్రశంసా పత్రాన్ని అందుకోలేకపోయారు. అలాగే బషీరాబాద్ ఇరిగేషన్ ఏఈ భానుప్రకాష్ ఉత్తమ అధికారిగా ఎంపికయ్యారు. స్పీకర్, కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు.
తాండూరు రూరల్: మూఢనమ్మకాలను విశ్వసించరాదని కరన్కోట్ పోలీసులు అన్నారు. శనివారం మండల పరిధి గుంతబాసుపల్లిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ఓ మహిళ.. ఆమె ఇంట్లో గుప్తనిధులు తవ్వుతున్నట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఆమె 20 ఏళ్లుగా ఇంటికి దూరంగా ఉండటంతో ఇంట్లో పుట్ట పేరుకుపోయిందని చెప్పారు. పుట్టను తవ్వి సీసీబెడ్ వేయడం కోసం గుంతను తవ్వినట్లు వివరించారు. గుప్త నిధులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. ఎలాంటి అనుమానాలకు పోకుండా.. ధైర్యంగా ఉండాలని గ్రామస్తులకు సూచించారు.
మొయినాబాద్: ఫాంహౌస్లో గంజాయి మొక్కను పెంచుతున్న వాచ్మెన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మొయినాబాద్ ఠాణా పరిధిలోని ఎనికేపల్లిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఎనికేపల్లి రెవెన్యూలో హృదయ ఫాంహౌస్లో నేపాల్కు చెందిన బ్యానేకామి అలియాస్ బహదూర్ అలియాస్ మోహన్ సింగ్ జైగాడి ఏడేళ్లుగా వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఫాంహౌస్గార్డెన్లో ఇతర మొక్కల మధ్య గంజాయి మొక్కను పెంచుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో శనివారం వ్యవసాయాధికారులతో కలిసి ఫాంహౌస్లో తనిఖీలు నిర్వహించారు. బయటకు కనిపించకుండా ఇతర మొక్కల మధ్య పెంచిన 15 అడుగుల ఎత్తున్న గంజాయి మొక్కను గుర్తించారు. మొక్కను 25 ముక్కలు, కాండాన్ని 4 ముక్కలు చేసి స్వాధీనం చేసుకున్నారు. దాని బరువు సుమారు 11.44 కిలోలు ఉంది. గంజాయి ముక్కలతోపాటు నిందితుడు వాచ్మెన్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వాచ్మెన్ను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఇబ్రహీంపట్నం: శేరిగూడ ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ఉత్తమ రైతు అవార్డు గ్రహీత మొద్దు అంజిరెడ్డి సహకారంతో నిర్మించిన డైనింగ్ హాల్(భోజనశాల)ను శనివారం ప్రారంభించారు. ఆయన భోజనశాల నిర్మాణానికి రూ.2లక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, కౌన్సిలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.


