● ఇప్పటి వరకు 83శాతం ప్రక్రియ పూర్తి
● కలెక్టర్ దీపక్ తివారి
అనంతగిరి: అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సర్ ప్రక్రియపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 10,17,671 ఓటర్లకు గాను ఇప్పటి వరకు 7,96,005 డిజిటలైజేషన్ చేయడం జరిగిందన్నారు. 83 శాతం ప్రక్రియ పూర్తయిందన్నారు. 1,13,092 ఏఎస్డీ(ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్, డూప్లికేట్) ఓటర్లుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈ జాబితాను గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ప్రదర్శించడం జరిగిందన్నారు. జాబితాలో ఏవైనా సమస్యలు ఉంటే రాజకీయ పార్టీ ప్రతినిధులు, బూతు స్థాయి ఏజెంట్లు అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఆగస్టు 3వ తేదీ నాటికి 100 శాతం పూర్తి చేసేలా అధికారులు పనిచేస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 1,200 మంది ఓటర్లు ఉంటే అదనంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓట్లు ఉండే విధంగా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఓటు అనేది చాలా ముఖ్యమని, రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎస్ఐఆర్లో అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదయ్యేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, డీఆర్ఓ స్వర్ణలత, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ నెమత్ అలీ, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ విజయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి డీజీపీ సీవీ ఆనంద్ అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎస్పీ స్నేహ మెహ్ర, అదనపు కలెక్టర్ వెంకటాచారి, అదనపు ఎస్పీ రాజేష్ మీనా, జెడ్పీ సీఈఓ సుధీర్, సీపీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


