కొడంగల్: మున్సిపల్ కొత్త చట్టంతో నిబంధనలు కఠినతరంగా మారాయి. ప్రతి ఇల్లూ, స్థలం ఆన్లైన్లో పొందుపరిచారు. యజమానులకు ఆస్తిపై భ ద్రత కల్పించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఇంటికీ ఆన్లైన్లో డిజిటల్ నంబర్ కేటాయించారు.మున్సిపాలిటీల్లో జవాబుదారీతనం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇంటి నిర్మాణ విషయంలో మున్సిపల్ చట్టాన్ని అతిక్రమిస్తే పాతిక రేట్లు జరిమానా విధించేలా చట్టాన్ని సవరించారు. అనుమతులు లేకుండా ఇల్లు నిర్మిస్తే కొత్త చట్టం ప్రకారం చర్యలుండనున్నాయి. ప్రతి ఇల్లు ఆన్లైన్లో ఉండాలి. లేకుంటే ఇంటికి జరిమానాలు విధించే అధికారం మున్సిపల్ సిబ్బందికి ఉంది. ప్రతి ఇంటికి డిజిటల్ నంబర్ ఉండాలి. దీంతో ఆస్తులకు భద్రత లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆన్లైన్ విధానంతో ఇంటి వివరాలతో పాటు పన్నుల చెల్లింపులను తెలుసుకోవచ్చు.
వార్డుల ఆధారంగా..
మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటి వరకు వార్డుల ఆధారంగా ఇంటి నంబర్లు ఉండేవి. మొదటి అంకెతో మొదలై మధ్యలో అడ్డగీత తర్వాత ఇంటి నంబర్లు ఉన్నాయి. బై నంబర్లు పెరగడంతో పరిస్థితి గందరగోళంగా ఉండేది. ఇళ్ల చిరునామా తెలుసుకోవడం కష్టంగా మారింది. పెరిగిన నివాస గృహాల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని డిజిటల్ నంబర్లను ఇళ్లకు కేటాయిస్తున్నారు. తద్వారా లోకేషన్లో సమా చారం తెలుసుకునేలా యాప్ను రూపొందించారు.
డిజిటల్ నంబర్లు
నూతన విధానంలో ఇకపై మున్సిపాలిటీల పరిధిలో ఉన్న ఇళ్లకు డిజిటల్ నంబర్ ప్లేట్ ఇవ్వనున్నారు. పిన్కోడ్ తరహాలో రాష్ట్ర, జిల్లా, పురపాలిక, వార్డులను తెలిపేలా కోడ్ ఉంటుంది. డిజిటల్ ఇంటి నంబర్ను ఇంటర్నెట్లో నమోదు చేయడం ద్వారా గూగుల్ మ్యాప్ ద్వారా అడ్రస్ తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే ఇంటి నంబర్తో పాటు బార్ కోడ్ను స్కాన్ చేస్తే పన్నుల చెల్లింపు, బకాయిల వివరాలు తెలుసుకోవచ్చు. కొత్తగా ఇండ్లు కట్టుకునే వారు ప్లాన్ ప్రకారమే కట్టాలి. తప్పు చేస్తే వారి లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. మున్సిపల్ పరిధిలో ఇంటి నిర్మాణాలు చేయాలంటే నిబంధనలు పాటించాలని అధికారులు చెబుతున్నారు.


