తిరుపతి మంగళం : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రవాణా, పోలీస్ శాఖల నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్, ట్రాఫిక్ డీఎస్పీ కొండయ్య హెచ్చరించారు. తిరుపతి జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో మంగళవారం రవాణా, పోలీస్శాఖల ఆధ్వర్యంలో జీపులు, సుమోలు, ట్యాక్సీ డ్రైవర్లు, వివిధ స్టాండ్ల అసోసియేషన్ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొర్రపాటి మురళీమోహన్ మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన సేవలందించాలన్నారు. అలా కాకుండా ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేయడం, అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకోవడం, వాహనాలను నిర్లక్ష్యంగా నడపడం వంటి వాటికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ డీఎస్పీ కొండయ్య మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో ట్రాఫిక్ నిర్వహణకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. డ్రైవర్లు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. సమావేశంలో ఏవీఎస్వో రమేష్, ట్రాఫిక్ సీఐ భాస్కర్నాయక్, మోటార్ వాహన తనిఖీ అధికారులు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, అతికా నాజ్, ట్యాక్సీ డ్రైవర్లు, అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.


