స్పెషల్ ‘టెట్లో’ లేదు
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు స్పెషల్ టెట్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 24న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదివరకు టెట్ ఎలా నిర్వహిస్తున్నారో ఇందులోనూ అలానే ఉందని, మరి ఎక్కడ స్పెషల్ ఉందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. తాము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన అంశాలు ఏవీ లేకుండానే పేరుకే స్పెషల్ టెట్ను నిర్వహించేందుకు సిద్ధమవ్వడం దారుణమని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి అయినప్పుడు వాస్తవ పరిస్థితులు పరిగణనలోకి తీసుకుని మానవీయ దృక్పథంతో పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేస్తున్నారు.
పేరుకే స్పెషల్
స్పెషల్ టెట్ నోటిఫికేషన్లో పేరుకే స్పెషల్ తప్ప, వాస్తవ పరిస్థితిలో కనిపించలేదని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. 150 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 90 మార్కులు(60 శాతం), బీసీలకు 75 మార్కులు (50శాతం), ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు, మాజీ సైనికులకు 60 మార్కులు (40శాతం) పాస్ మార్కులుగా కేటాయించారని, అయితే స్పెషల్ టెట్లో కేటగిరిలతో సంబంధం లేకుండా అందరికి 60 మార్కులు (40శాతం) పాస్ మార్కులుగా కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం
సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత, జీవనోపాధి, పదోన్నతులను కాపాడాల్సిన అవసరాన్ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. 2010, ఆగస్టు 23వ తేదీకి ముందుకు ఉపాధ్యాయులుగా నియమితులైన వారికి టెట్ నుంచి పూర్తి, శాశ్వత మినహాయింపు ఇవ్వాలని, దీనికోసం ఆర్టీఈ చట్టంలో అవసరమైన మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న యూటీఎఫ్ నాయకులు
ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్లు
1. ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న టెట్లో అన్ని కేటగిరీ ఉపాధ్యాయులకు 150 మార్కులకు 40 శాతం (60 మార్కులు)గా ప్రకటించాలి.
2. ప్రస్తుతం ఉపాధ్యాయులు ఏ సబ్జెక్టును, ఏ తరగతులకు బోధిస్తున్నారో దానిని పరిగణనలోకి తీసుకుని టెట్ నిర్వహించాలి. పేపర్–2 సిలబస్ 6–10 తరగతుల పాఠ్యాంశాల ఆధారంగా ఉండడంతో పాటు కాఠిన్యత ఇంటర్మీడియెట్ స్థాయి వరకు ఉంటుందని ప్రస్తుత నోటిఫికేషన్లో పేర్కొనడం శోచనీయం.
3. టెట్ పరీక్ష హాజరు కాలేని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహించాలి.


