తిరుపతి మంగళం : చంద్రబాబు ఉద్దరిస్తాడని నమ్మి ఓట్లు వేసినందుకు ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి మారుతీ నగర్లోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద శనివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. ఎన్నికల్లో ఓట్లు వేసి అందలమెక్కించిన ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను సైతం గాలికి వదిలేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు. టెట్ సమస్యపై కేంద్ర మంత్రిని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లిన ముగ్గురు టీచర్లపై సస్పెన్షన్ వేటు వేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనపై ప్రజలు, ఉద్యోగుల తిరుగుబాటు మొదలైందన్నారు.
డీఎస్సీ ఉద్యమం తీవ్ర తరం
డీఎస్సీ అవినీతిపై ఢిల్లీలో నీట్ లీకేజీపై కాక్రోజ్ జనతా పార్టీ చేపట్టిన విధంగా ఉద్యమాన్ని రాష్ట్రంలో తీవ్రతరం చేయాలని పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. అప్పుడే డీఎస్సీ అక్రమాలు బయటకు వస్తాయని చెప్పారు. తన కుమారుడు లోకేష్ చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కొందమంది టీచర్లను ప్రేరేపించి తిరుగుబాటు ఉద్యమం చేయించడం చంద్రబాబు నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ప్రజలు, ఉద్యోగులు మళ్లీ వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారన్నారు. టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు పోకల అశోక్కుమార్, మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి ఈశ్వర్రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిరణ్కుమార్రెడ్డి పాల్గొన్నారు.
జాతీయ జెండాకు
గౌరవ వందనం చేస్తున్న మాజీ మంత్రి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


