తిరుపతి రూరల్ : ఎస్పీడీసీఎల్ పరిధిలో వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందిస్తామని, ఈ మేరకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని సీఎండీ శివశంకర్ తెలిపారు. సంస్థ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులపై డైరెక్టర్లు అయూబ్ఖాన్, గురవయ్యతో కలిసి సమీక్షించారు. సీఎండీ మాట్లాడుతూ లోఓల్టేజ్ సమస్యను అధిగమించడం, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు సుమారు రూ. 520 కోట్ల వ్యయంతో 104 సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. అందులో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు 8 సబ్ స్టేషన్లు, తిరుపతి జిల్లాకు 14, చిత్తూరుకు 11, అన్నమయ్య– 13, వైఎస్సార్ కడప–7, కర్నూలు–6, నంద్యాల–8, అనంతపురం– 14, శ్రీసత్యసాయి జిల్లాకు 14, కుప్పం రెస్కోకు 9 సబ్స్టేషన్లు మంజూరు చేశామని వివరించారు. వాటిలో 29 సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చామని, మరో 13 సబ్ స్టేషన్ల నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. వీటిని త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. మరో 50 సబ్స్టేషన్ల నిర్మాణానికి సంబంధించి టెండరు ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన 12 సబ్స్టేషన్ల పనులకు టెండరు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందని వెల్లడించారు. సబ్స్టేషన్ల నిర్మాణంలో సంబంధిత కాంట్రాక్టర్లు తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలను పాటించాలని స్పష్టం చేశారు. పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


