శ్రీసిటీ (వరదయ్యపాళెం):చైన్నెలోని జర్మనీ ఫెడరల్ రిపబ్లిక్ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్ బుధవారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) ఆర్.శివశంకర్ ఆయనకు స్వాగతం పలికారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ, శ్రీసిటీ పారిశ్రామిక ప్రగతి, ప్రత్యేకతలను వివరించారు. జర్మనీ నుంచి మరిన్ని పెట్టుబడులకు ఈ పర్యటన దోహదపడుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పన్ను రాయితీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెట్టుబడిదారుల అనుకూల విధానాలపై అవగాహన కల్పించారు. శ్రీసిటీ ప్రణాళిక, ఆధునిక మౌఇక వసతులు, వ్యాపార అనుకూల వాతావరణాన్ని మైఖేల్ హాస్పర్ ప్రశంసించారు. శ్రీసిటీ ఒక ప్రపంచస్థాయి పారిశ్రామిక నమూనాగా అభివర్ణించారు. జర్మనీకి భారత్ కీలక వాణిజ్య భాగస్వామిగా పేర్కొన్న ఆయన, ఇక్కడ విస్తరిస్తున్న మార్కెట్, పెట్టుబడి అనుకూల విధానాలు ఇరు దేశాల మధ్య వాణిజ్య, పారిశ్రామిక సహకారానికి అపారమైన అవకాశాలను కల్పిస్తున్నాయని వివరించారు. అనంతరం జర్మనీకి చెందిన నాఫ్ (కేఎన్ఏయూఎఫ్) పరిశ్రమను సందర్శించి, అక్కడి సిబ్బందితో మాట్లాడారు.


