సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాతో పాటు అటవీ ప్రాంతాల్లో శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన చిన్న నీటిపారుదల చెరువుల మరమ్మతులు, పునరుద్ధరణ, పునరుజ్జీవన పనులు చట్టప్రకారం చేపడుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులశాఖ సహాయమంత్రి కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఈ పనులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అటవీ శాఖలే నిబంధనలకు అనుగుణంగా చేపడుతున్నాయని తెలిపారు.
పోలీస్ గ్రీవెన్స్కు 76 అర్జీలు
తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 76 ఫిర్యాదులు అందినట్టు జిల్లా ఏఎస్పీలు తెలిపారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలను పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.
ఇన్నోవేషన్ స్టార్టప్పై శిక్షణ
తిరుపతి సిటీ: ఎస్వీయూలో అధ్యాపకులకు ఆరు రోజుల పాటు జరగనున్న ఇన్నోవేషన్ స్టార్టప్ ఎకో సిస్టం అండ్ ఎంటర్ప్రైనర్ షిప్ ఎంపవరింగ్ ఎడ్యుకేటర్స్ టు బిల్డ్ ఫ్యూచర్ ఇన్నోవేటర్స్ అనే అంశంపై అధ్యాపక అభివృద్ధి కార్యక్రమం ప్రారంభమైంది. రూసా ఫేజ్–2, సెంటర్ ఆఫ్ఎక్సలెన్స్ ఇన్ వైరస్ లైక్ పార్టికల్స్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని వీసీ టాటా నర్సింగరావు సోమవారం ప్రారంభించారు. అనంతనం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఆలోచనలను గుర్తించి వాటికి సరైన మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. ఉపయోగకరమైన ఆవిష్కరణలు, స్టార్టప్లుగా రూపుదిద్దే వాతావరణాన్ని విశ్వవిద్యాలయాలు కల్పించాలని పేర్కొన్నారు. రెక్టార్ ఆచార్య అప్పారావు మాట్లాడుతూ యువప్రతిభను గుర్తించి విద్యార్థులను ఆవిష్కరణలు, వ్యవస్థాపకత స్వయం ఉపాధి వైపు నడిపించడంలో అధ్యాపకుల పాత్ర కీలకమని తెలిపారు. కాలేజ్ ఆఫ్ సైన్సెస్ ప్రిన్సిపల్ ఆచార్య పద్మావతి, వైజాగ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ రవి ఈశ్వరపు, ఆచార్య హేమ, ఆచార్యులు కేవీ సుచరిత, బాలాజీ, రాజశేఖర్, వంశీ రాయల బృందం పాల్గొంది.
5వ బ్రిక్స్ వర్కింగ్
సమావేశం ప్రారంభం
ఏర్పేడు: భారత ప్రభుత్వ విజ్ఞాన మరియు సాంకేతిక శాఖ (డిఎస్టి) ఆధ్వర్యంలో తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో సోమవారం తిరుపతి ఐఐటీ నవవిష్కర్ ఐ–హబ్ ఫౌండేషన్ (ఐఐటీటీఏన్ఐఎఫ్) సహకారంతో, జియోస్పేషియల్ టెక్నాలజీలు, వాటి అనువర్తనాలపై 5వ బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ అంతర్జాతీయ సమావేశాన్ని ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ ప్రారంభించారు. ‘స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం’ అనే ఇతివృత్తంతో నిర్వహించిన అంతర్జాతీయ సమావేశం, సమకాలీన ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో, సుస్థిరాభివృద్ధిని పెంపొందించడంలో జియోస్పేషియల్ టెక్నాలజీల పాత్రపై చర్చించడానికి బ్రిక్స్ దేశాలు, భాగస్వామ్య దేశాల నుంచి విధాన రూపకర్తలు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు, పరిశోధనా సంస్థల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల ప్రతినిధులు వర్చువల్గా హైబ్రిడ్ పద్ధతిలో పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న వక్తలు బ్రిక్స్ దేశాల్లో జియోస్పేషియల్ ఎకోసిస్టమ్లను బలోపేతం చేయడంలో అంతర్జాతీయ సహకారం, సాంకేతిక ఆవిష్కరణల ప్రాముఖ్యతను ప్రముఖులు నొక్కి చెప్పారు. సామాజిక సవాళ్లను పరిష్కరించడంలో జియోస్పేషియల్ టెక్నాలజీల పరివర్తనాత్మక పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. కార్యక్రమంలో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సెక్రటరీ గౌతమ్ గోవింద్, నేషనల్ జియోస్పేషియల్ ప్రోగ్రామ్ డివిజన్ హెడ్ డాక్టర్ మనోరంజన్ మొహంతి, డీఎస్టీకి చెందిన సైంటిస్ట్ డాక్టర్ శుభాపాండే, డాక్టర్ అరిందమ్ భట్టాచార్య, నవవిష్కార్ ఐ–హబ్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ రోషన్ శ్రీవాస్తవ్ తదితరులు పాల్గొన్నారు.


