తిరుపతి అర్బన్: చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి 25 నెలలు గడుస్తోంది. ఇప్పటి వరకు అర్హత ఉన్న ఏ ఒక్కరికీ కొత్త పింఛన్ల దరఖాస్తుకు అనుమతివ్వలేదు. సాధారణంగా ప్రతి ఏటా జూలై, జనవరిలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశాలు కల్పించేవారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక అలాంటి అవకాశాలేవీ కల్పించలేదు. పైగా కార్యాలయాల చుట్టూ అర్హులు తిరుగుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు.
క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు
కలెక్టరేట్ కార్యాలయంలో సోమవా రం కొత్తగా పీజీఆర్ఎస్లో అర్జీలు ఇచ్చే ప్రదేశంలో క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేశారు. అర్జీదారులు తమ సమస్య పరిష్కారం కోసం తమ మొబైల్తో క్యూఆర్ కోడ్ను స్కానింగ్ చేసి సమస్యను తెలియజేస్తే జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి చేరుకుంటుందని అధికారులు అంటున్నారు. అయితే కొందరు మాత్రం ఆ క్యూఆర్ కోడ్ సక్రమంగా పనిచేయడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు. మొత్తంగా అర్జీదారుల దృష్టిని క్యూ ఆర్ కోడ్ వైపు మళ్లించినట్లు తెలుస్తుంది.
పింఛన్ ఇప్పించండయ్యా!
నా పేరు కమలమ్మ. మాది పుత్తూరు మండలం, తడుకు గ్రామం. నాకు 91 శాతం వైకల్యం ఉంది. ఏడాదిగా పింఛన్ కోసం తిరుగుతూనే ఉన్నా. వీల్చైర్కే పరిమితమైన. అధికారులకు అర్జీలిస్తున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడంలేదు. తల్లిదండ్రులకు సైతం భారంగా మారుతున్నా. ఇప్పటికై నా అధికారులు స్పందించి పింఛన్ మంజూరు చేయాలి.
ఇంటి స్థలాలు చూపండి సార్
ఏర్పేడు మండలంలోని పెనుమల్లం ఎస్టీ కాలనీకి చెందిన పలువురు మహిళలలు తమకు ఇంటిస్థలాలు ఇవ్వాలని సోమవారం కలెక్టరేట్లో అర్జీలను అందజేశారు. అన్నదమ్ముళ్లు విభజన నేపథ్యంలో ఎప్పుడో 50 ఏళ్ల క్రితం ఉన్న ఇంట్లోనే నివాసం ఉంటున్నామని, విడిపోయిన నేపథ్యంలో స్థలం ఇస్తే కొత్తగా ఇంటిని నిర్మించుకుంటామని తమ చిన్న బిడ్డలతో కలెక్టరేట్కు వచ్చి అధికారులకు అర్జీలను అందించారు. –పెనుమల్లం ఎస్టీ కాలనీ వాసులు


