ఆ తర్వాత అతన్ని రహస్య ప్రదేశానికి
పంపించిన టీడీపీ నేత
అధికారాన్ని అడ్డంపెట్టుకుని కేసును
నీరుగార్చే యత్నం
●
చంద్రగిరి: పశువుల కాపరి కుమారి(36) మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి టీడీపీ నేత యత్నించడం ఇప్పుడు హాట్టాఫిక్గా మారింది. వివరాలు.. మండల పరిధిలోని మండపంపల్లికి చెందిన టీడీపీ నాయకుడు చెంగళ్రాయులురెడ్డికి 50 పశువులు ఉన్నాయి. వాటిని మూలపల్లి అటవీ ప్రాంతంలో ఉంచి మూడేళ్ల క్రితం రాజేంద్ర, కుమారి అనే దంపతులను కాపలాదారులుగా ఉంచాడు. ఈ క్రమంలో సోమవారం వారికి టీడీపీ నేత చెంగళ్రాయులరెడ్డి మద్యం తీసుకెళ్లి ఇచ్చినట్లు సమాచారం. ఆ దంపతులిద్దరూ మద్యం సేవించి, మత్తులో ఇద్దరి మధ్య గొడవ రావడంతో రాజేంద్ర తన భార్య కుమారిని హతమార్చినట్టు సమాచారం. ఈ విషయాన్ని రాజేంద్ర టీడీపీ నేత చెంగళ్రాయులరెడ్డికి సమాచారం అందించగా.. అతను ఘటనా స్థలానికి చేరుకుని కుమారి ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించేందుకు యత్నించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పశువులకు ఉపయోగించే పురుగుల మందును కుమారి మృతదేహం, దుస్తులు, పరిసరాల్లో చల్లినట్లు తెలుస్తోంది. అయితే మృతదేహంపై రక్తగాయాలు ఉండడంతో గుట్టుచప్పుడు కాకుండా మంగళంపేటలో ఉన్న మృతురాలి పెద్ద కుమార్తె కృష్ణవేణికి సమాచారం అందించి దహనక్రియలు చేయాలని పురమాయించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కుమారి మృతదేహాన్ని తీసుకెళ్తున్న సమయంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించగా రక్తగాయాలు ఉండడం, భర్త రాజేంద్ర పరారీ కావడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా భావించారు.
కేసు నీరుగార్చే కుట్ర
మండపంపల్లికి చెందిన చెంగళ్రాయులరెడ్డి కేసును నీరుగార్చేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఆధారాలను చెరిపేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు సమాచారం. కుమారి మృతి చెందిన వెంటనే పోలీసులకు సమాచారం అందించకుండా, దహనక్రియలు నిర్వహించేందుకు పురమాయించడం అనుమానాలకు తావిస్తోంది.
అన్నీ కోణాల్లో విచారిస్తున్నాం
కుమారి మృతి వెనుక ఉన్న మిస్టరీపై అన్నీ కోణాల్లో విచారణ చేస్తున్నాం. ఆమె భర్త రాజేంద్ర ఆచూకీ కోసం గాలింపులు చేపట్టాం. పశువుల యజమాని చెంగళ్రాయులరెడ్డిని కూడా విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు అనంతరం మరింత లోతుగా విచారణ చేపడుతాం. – అరుణాచలం, ఎస్ఐ చంద్రగిరి
మద్యం మత్తులో భార్యను కడతేర్చిన భర్త రాజేంద్ర


