సంకల్పం సిద్ధించేనా?
ఈ ఏడాదైనా మెరుగైన ఫలితాలతో జిల్లా పరువు నిలిచేనా! గత ఏడాది పదిలో 19వ స్థానం... ఇంటర్లో 8, 9 స్థానాలు ఫిబ్రవరి ఒకటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్...అదే నెల 23 నుంచి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి పది పబ్లిక్... ప్రత్యేక ప్రణాళిక ఫలించేనా! సంకల్ప్–2026 ప్రణాళికతో ఆశించిన ఫలితాలు దక్కేనా?
ఫలితం పదిలమై..
●
‘పది’ంతల ఆనందం చెందాలని.. వంద రోజుల ప్రణాళికతో ఫలితాలు మెరుగు.. శత శాతం ఉత్తీర్ణత.. రాష్ట్రస్థాయిలో ఉన్నత స్థానం సాధనకు విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు, హెచ్ఎంలు కృషి చేస్తున్నారు. అలాగే సంకల్పం పేరుతో ఇంటర్మీడియట్ విద్యార్థుల శతశాతం ఫలితాలకు ప్రణాళికలు సిద్ధం చేసి కష్టపడుతున్నారు. అయితే వారి సాధన, కృషి, ప్రణాళికలు సత్ఫలితాలు ఇస్తాయో? లేదోనని విద్యావేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి సిటీ: జిల్లాలో గత ఏడాది పదో తరగతి ఫలితాలు దారుణంగా పడిపోయాయి. ఏకంగా రాష్ట్ర స్థాయిలో 19వ స్థానానికి దిగజారడంతో అధికారుల తీరుపై ప్రభుత్వం మండిపడింది. దీంతో ఈ ఏడాది పది పరీక్షలపై జిల్లా విద్యాశాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఫలితాల మెరుగుపై ప్రత్యేక దృష్టి సారించాలని దిశానిర్ధేశం చేశారు. పది విద్యార్థులకు వంద రోజుల ప్రణాళికను పక్కా అమలు చేయాలని, విద్యార్థులకు ప్రతిరోజు కష్టతరమైన పాఠ్యాంశాలపై దృష్టి సారించి, సామర్థ్య పరీక్షలు నిర్వహించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఇంటర్మీడియట్ ఫలితాలు గతం కంటే మెరుగుగా సాధించాలనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తోంది.
వంద రోజుల ప్రణాళికతో పది..పరువు నిలిచేనా?
గత ఏడాది పది ఫలితాల్లో తిరుపతి జిల్లా వెనుకబడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో వంద శాతం ఫలితాల సాధనకు వంద రోజుల ప్రణాళికను ప్రత్యేకంగా రూపొందించారు. విద్యాశాఖాధికారి స్వయంగా ప్రతి పాఠశాలను పర్యవేక్షిస్తూ ఉపాధ్యాయులు ఫలితాల మెరుగుకు పలు సూచనలు చేస్తున్నారు. పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు క్రమం తప్పకుండా నిర్వహించాలని, కాస్త వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేయాలని సూచిస్తున్నారు. మార్చి 16వ తేదీన పది పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానుండడంతో ప్రతి పాఠశాలలో రోజూ అన్ని సబ్జెక్టులకు సంబంధించి స్లిప్ టెస్ట్లు నిర్వహించి, విద్యార్థుల సామర్థాన్ని మదింపు వేసేలా చర్యలు చేపట్టారు. ఈ ఏడాది పది ఫలితాల్లో జిల్లా పరువు నిలిచేలా టాప్ 5లో నిలబెట్టాలని అధికారులు కృషి చేస్తున్నారు.
పది, ఇంటర్ పరీక్షలపై అధికారుల ప్రత్యేక దృష్టి
సంకల్ప్–2026..సక్సెస్ సాధించేనా!
ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్, అదే నెల 23 నుంచి పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి 2025–26 విద్యా సంవత్సరంలో సరికొత్త వ్యూహంతో ముందుకెళ్లుతోంది. ఇందులో భాగంగా సంకల్ప్–2026 పేరుతో 50 రోజుల ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు డిసెంబర్ 22 నుంచి ఫిబ్రవరి 20వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. విద్యార్థుల సామర్థ్యం ఆధారంగా ఏ,బీ,సీ కేటగిరీలుగా విభజించి రివిజన్ టెస్ట్లు, ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించి విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. గత ఏడాది ఇంటర్ ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో అధ్యాపకులకు నూతన సిలబస్, కొత్త పరీక్షా విధానాలపై ఇప్పటికే పలు మార్లు అవగాహన కల్పించారు. ఇంటర్మీడియట్ ఫలితాలపై ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ప్రత్యేక దృష్టి సారించి, గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఆర్ఐఓలకు దిశానిర్థేశం చేశారు. కాగా నూతన సిలబస్, కొత్త పరీక్షల విధానంతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఈ ఏడాది పరీక్షలు కత్తి మీద సామేనని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
జిల్లా సమాచారం పదో తరగతి
మొత్తం ఉన్నత పాఠశాలలు 323
2024–25లో పది పరీక్షలకు హాజరైన విద్యార్థులు 26,875
ఉత్తీర్ణులై విద్యార్థులు 20,597
ఉత్తీర్ణత శాతం 79శాతం
రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థానం 19
ఈ ఏడాది పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల సంఖ్య 27,154
ఇంటర్మీడియట్
ప్రభుత్వ కళాశాలలు 72
ప్రైవేటు జూనియర్ కళాశాలలు 109
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు 31,479
ఉత్తీర్ణులైన విద్యార్థులు 22,403 (71 శాతం)
రాష్ట్రం స్థాయిలో జిల్లా స్థానం 9
ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు 28,460
ఉత్తీర్ణులైన విద్యార్థులు 24,581 (86శాతం)
రాష్ట్రం స్థాయిలో జిల్లా స్థానం 8
ఈ ఏడాది హాజరుకానున్న ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 32,438
సెకండ్ ఇయర్ విద్యార్థులు 28,395
సంకల్పం సిద్ధించేనా?


