జిల్లా సమాచారం
ఫీజు రీయింబర్స్మెంట్ ఊసెత్తని
బాబు సర్కార్
ఉన్నత విద్యకు దూరమవుతున్న
పేద విద్యార్థులు
కళాశాలలు పీడిస్తున్నాయంటూ
తల్లిదండ్రుల గగ్గోలు
జిల్లాలో ప్రైవేటు కళాశాలలు 108
చదువుతున్న విద్యార్థులు 47,360
ఒక్కొక్కరికి ఏడాదికి అందాల్సిన సరాసరి మొత్తం రూ.18 వేలు
పెండింగ్లో ఉన్నది (19 నెలలుగా) 7 విడతలు
పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు రూ. 345.35కోట్లు
ఒక్కో కళాశాలకు రావాల్సి బకాయిలు రూ. 4.05కోట్లు
47 వేల మంది విద్యార్థులకు శాపం
చంద్రబాబు సర్కార్ వ్యవహార శైలి జిల్లాలో ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులైన దాదాపు 47,360 మంది విద్యార్థులకు శాపంగా మారింది. ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ, ఇంజినీరింగ్, పలు రకాల వైద్య విద్యలో యూజీ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థుల భవితవ్యం ఆగమ్యగోచరంగా మారింది. కళాశాలల యాజమాన్యాలు ఫీజుల చెల్లిస్తేగాని హాల్టికెట్లు ఇవ్వమని బెదిరిస్తుండగా మరికొన్ని కళాశాలలు కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ధ్రువపత్రాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి.
తిరుపతి సిటీ: చంద్రబాబు ప్రభుత్వ పాపం.. పేద విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఫీజు రీయింబర్స్మెంట్ అందక జిల్లాలో వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. లోకేష్ యువగళం పాదయాత్రలో, చంద్రబాబు ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ క్రమం తప్పకుండా అందిస్తామని ప్రగల్భాలు పలికారు. అధికారంలోకి వచ్చి 19 నెలలు కావస్తున్నా ఒక విడత మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో 2025–26 విద్యా సంవత్సరంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తుందన్న నమ్మకం లేక, సొంతంగా ఫీజులు చెల్లించలేక ఇంటర్తోనే చదువు నిలిపేసి ఉన్నత విద్యకు దూరమవుతున్నారు.
ఉన్నత విద్యకు దూరమవుతున్న పేదలు
జిల్లాలో పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదు. దీంతో ప్రైవేటు కళాశాలలు 2025–26 విద్యాసంవత్సరంలో అడ్మిషన్ల సమయంలో ఫీజు చెల్లించాల్సిందేనని, ఫీజురీయింబర్స్మెంట్పై నమ్మకం పెట్టుకోవద్దని యాజమాన్యాలు తేల్చిచెబుతున్నాయి. దీంతో చాలా మంది విద్యార్థులు ఇంటర్తోనే చదువును నిలిపివేసినట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
పొరుగు రాష్ట్రాల్లో చదివే వారికి ఆప్షనే లేదు
చంద్రబాబు ప్రభుత్వంలో పొరుగు రాష్ట్రాల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీలకు మినహా మిగిలిన బీసీ, కాపు, ఈబీసీ, క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ విద్యార్థులకు కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆన్లైన్ ఆప్షన్ ఇవ్వకపోవడం దుర్మార్గమని అంటున్నారు. దీంతో పొరుగు రాష్ట్రాల్లో యూజీ కోర్సులు చదువుతున్న సుమారు 6,500 మంది విద్యార్థులు సొంతంగా ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అర్హులైన ప్రతి విద్యార్థికీ అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫీజురీయింబర్స్ మెంట్ అవకాశాన్ని కల్పించి ఆదుకున్నారు.
బాబు పాపం..
విద్యార్థులకు శాపం!
కళాశాలలు పీడిస్తున్నాయి
మా అబ్బాయి చంద్రగిరి నియోజకవర్గంలోని ఓ పేరొందిన ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం బీటెక్ చదువుతున్నాడు. గత రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో ఫీజు చెల్లించాల్సిందేనని కళాశాల యాజమాన్యాలు పీడిస్తున్నాయి. ఇప్పటికే అప్పులు చేసి ఏడాది ఫీజు చెల్లించాం. ప్రభుత్వం ఇప్పటికై బకాయిలు విడుదల చేయాలి. లేదంటే హాల్టెక్కెట్ ఇచ్చే పరిస్థితి కనబడలేదు. – పూర్ణిమ, విద్యార్థి తల్లి, వెంకటగిరి
బకాయిలు ఇవ్వకపోతే ఉద్యమమే
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా బాబు సర్కారు విద్యా ర్థుల జీవితాలతో ఆడుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.6400 కోట్ల బకాయిలు తక్షణం చెల్లించాలి. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించాం. అయినా వారి తీరు మారలేదు. ఈ ఏడాది విద్యార్థులను హింసిస్తే విద్యార్థి సంఘాలతో కలసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.
– బండి చలపతి, ఏఐఎస్ఎఫ్
రాష్ట్ర సహాయ కార్యదర్శి, తిరుపతి
విద్యార్థుల జీవితాలతో ఆటలా?
చంద్రబాబు సర్కార్ విద్యార్థుల జీవితాలతో ఆటలాడటం ఆపాలి. ప్రభుత్వ తీరుతో ఎంతో మంది గ్రామీణ, పట్టణ ప్రాంత పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించలేని పరిస్థితి నెలకొంది. ఎంతో మంది పేదల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది. ఇందుకు తానే నిదర్శనం. విద్యార్థి నాయకుడిగా ఉండి కూడా ఫీజు చెల్లించనిదే సర్టిఫికెట్లు ఇవ్వమని ఎస్వీయూ అధికారులు తేల్చి చెప్పారు. – వినోద్, ఎస్ఎఫ్ఐ,
ఎస్వీయూ కార్యదర్శి, తిరుపతి
జిల్లా సమాచారం


