
అంతా తికమక
మెగా మెలిక..
● టెట్ ఉత్తీర్ణత సాఽధించినా డీఎస్సీ అర్హత కఠినతరం ● పది, ఇంటర్లో 50 శాతం అర్హత అవసరమా! ● ఇంటర్ తప్పి తిరిగి 35 శాతంతో పాసైన వారు ఐఏఎస్లు కాలేదా? ● సివిల్స్కు లేని నిబంధనలు డీఎస్సీకి ఎందుకు? ● ఇది కుట్రలో భాగమే అంటున్న నిరుద్యోగులు ● మండిపడుతున్న విద్యార్థి సంఘాలు, డీఎస్సీ అభ్యర్థులు
ఉమ్మడి చిత్తూరు జిల్లా సమాచారం
ప్రాథమిక పాఠశాలలు – 3,766
ప్రాథమికోన్నత పాఠశాలలు – 445
ఉన్నత పాఠశాలలు – 705
ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు–
సుమారు 6,245
ప్రస్తుతం భర్తీ చేసేందుకు నోటిఫికేషన్
ఇచ్చిన పోస్టులు – 1,478
పోటీపడనున్న అభ్యర్థులు – 72 వేల మంది
అర్హత మెలికతో డీఎస్సీకి దూరం కానున్న
అభ్యర్థులు– సుమారు 14వేల మంది
తిరుపతి సిటీ: ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వివాదాలకు తావిస్తోంది. డీఎస్సీకి దరఖాస్తు చేయాలంటేనే అభ్యర్థులు వణికిపోతున్నారు. ఆన్లైన్ అగచాట్లు తలబొప్పి కట్టిస్తుండగా.. అర్హత నిబంధనలు తికమకపట్టిస్తున్నాయి. పది, ఇంటర్లో 40 నుంచి 50శాతం మార్కులు సాధించి ఉండాలని, అలాగే డిగ్రీలో 50శాతం, పీజీలో 55 శాతం తప్పనిసరి చేయడంతో అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 శాతం వెసులుబాటు కల్పించారు. గతంలో జరిగిన డీఎస్సీలో ఇలాంటి కఠన నిబంధనలు లేవని, కొత్తగా పది, ఇంటర్, డిగ్రీ మార్కుల అర్హతలను ప్రామాణికం చేయడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడంలేదని డీఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కుట్రలో భాగమేనా?
సివిల్స్ సర్వీసుకు సైతం ఎలాంటి నిబంధనలు లేవు. పది, ఇంటర్లో సప్లమెంటరీ పరీక్షలు రాసి 35 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన ఎంతో మంది సివిల్స్ సాధించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులయ్యారు. అలాంటిది టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించినా పది, ఇంటర్, డిగ్రీల పర్సెంటేజ్పై నిబంధనలు పెట్టడం విమర్శలకు తావిస్తోంది. డీఎస్సీని సజావుగా జరపకూడదనే కుట్రతోనే ప్రభుత్వం మెలికలతో కూడిన డీఎస్సీని విడుదల చేసిందని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.