World Blood Donor Day: కరోనాలోనూ బాధితులకు ఊపిరిపోస్తున్న దాతలు | World Blood Donor Day 2021: Impact Of Covid19 On Blood Donation | Sakshi
Sakshi News home page

కరోనా సమయంలోనూ రక్తదానం..  బాధితులకు ఊపిరిపోస్తున్న దాతలు

Jun 14 2021 8:13 AM | Updated on Jun 14 2021 8:13 AM

World Blood Donor Day 2021: Impact Of Covid19 On Blood Donation - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, వేములవాడ(కరీంనగర్‌): కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ రక్తదాతలు తమ కర్తవ్యాన్ని విస్మరించట్లేదు. ప్రాణాపాయస్థితిలో రక్తం కోసం కొట్టుమిట్టాడుతున్న వారికి ‘మేమున్నాం’ అంటూ రక్తదానం చేసి ఆపద్భాంధవులుగా నిలుస్తున్నారు. రక్తం పంచి ఆయుష్షు పెంచుతున్నారు. రక్తదాతలు తమ దయాగుణంతో ప్రతీ రోజు ఎంతో మంది ప్రాణాలు కాపాడుతూ చిరంజీవులుగా ఉండేలా సహాయపడుతున్నారు. స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేసి ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. 

జూన్‌ 14న..
‘రక్తదానం చేయండి.. ప్రపంచంలోని అందరి గుండెలు ఆగకుండా పరిగెత్తేలా చేయండి’ అనే  నినాదంతో ఈ ఏడాది ప్రపంచ రక్తదాతల దినో త్సవం నిర్వహిస్తున్నారు. అయితే 2005 మే లోనే అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం జరపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది. ర క్తాన్ని ఏ, బీ, ఏబీ, ఓ పాజిటివ్, నెగెటివ్‌ గ్రూపుల ను కార్ల్‌ లాండ్‌ స్టీవర్‌ గుర్తించారు. ఆ యన జన్మదినం జూన్‌ 14న ఉండడంతో అదే రోజున ప్రపంచ రక్తదాతల దినో త్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. 

1,200 మందితో..
రక్తం లేక ఎవరూ తనువు చాలించకూడదనే సేవాభావంతో రామగుండం యువ మిత్ర సేవా సమితి సంస్థ ఏర్పాటు చేశా. యువతకు రక్తదానంపై అవగాహన కల్పిస్తూ, శిబిరాలు నిర్వహిస్తున్న. 1200 మందితో రక్తదానం చేయించా. నేను కూడా 18 సార్లు చేశా. ఐదు రోజుల క్రితం రక్తదానం చేసిన తర్వాత కోవిడ్‌ టీకా తీసుకున్నా. జీవితంలో రక్తదానం చేయడం ఒక మంచి అలవాటుగా మార్చుకున్నా. 
– ఈదునూరి శంకర్, జాతీయ యువజన అవార్డు గ్రహీత, గోదావరిఖని 

12 సార్లు శిబిరాలు ..
 స్వగ్రామం అల్గునూర్‌. అల్లుఅర్జున్‌ అభిమాన సంఘం జిల్లా అ«ధ్యక్షుడిగా కొనసాగుతున్న. అత్యవసర సమయంలో రక్తదానం చేసి అనారోగ్యానికి గురైన వ్యక్తి ప్రాణాలు నిలబెడితే అతడి బంధువుల కళ్లలో కనిపించే కృతజ్ఞత భావం మరోసారి దానం చేసేందుకు ప్రోత్సహిస్తుంది. ఇప్పటికీ 22 సార్లు రక్తదానం చేసిన. అల్లు అర్జున్‌ అభిమానులసాయంతో 12 సార్లు శిబిరాలు నిర్వహించి 600 యూనిట్ల రక్తాన్ని వివిధ కేంద్రాలకు  అందజేశా.              
 – తమ్మనవేని అంజియాదవ్, అల్గునూర్, కరీంనగర్‌

అపోహలు వీడండి
రక్తదానం చేయడంలో అపోహలు వీడాలి. ప్రతీ వ్యక్తిలో కనీసం ఐదున్నర లీటర్ల రక్తం ఉంటుంది. రక్తదానం చేసిన తర్వాత రెండు రోజుల్లో ఆ వ్యక్తికి తిరిగి రక్తం సమకూరుతుంది. కరోనా నెగిటివ్‌ వచ్చిన వారు నాలుగు వారాల తర్వాత రక్తదానం చెయవచ్చు. అలాగే కోవిడ్‌ టీకా తీసుకున్న కూడా నాలుగు వారాల వరకు రక్తదానం చేయకూడదు. అందుకే రక్తదానం చేసిన తర్వాతే కోవిడ్‌ టీకా తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నాం. 
– డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, సూపరింటెండెంట్, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, గోదావరిఖని

30 ఏళ్లు.. 56 సార్లు..
మాది వేములవాడ మండలం నూకలమర్రి. బీ పాజిటివ్‌ బ్లడ్‌ గ్రూపు. 1990 నుంచి ఇప్పటి వరకు 56 సార్లు రక్తం ఇచ్చినా. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ అవసరం ఉన్నా స్వయంగా వెళ్లి రక్తదానం చేస్తా. అత్యవసర సమయంలో బాధితులకు రక్తదానం చేయడం ఎంతో ఆనందాన్ని కల్గిస్తుంది.
– సోమినేని బాలు, యువజన సంఘాల జిల్లా అధ్యక్షుడు, సిరిసిల్ల

ఇప్పటి వరకు 48 సార్లు..
కరీంనగర్‌లోని జ్యోతినగర్‌లో ఉంటా. అభిమాన నటుడు చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. రక్తం అవసరమనే సమాచారం ఎవరిచ్చినా వెంటనే స్పందిస్తా. 1996 నుంచి ఇప్పటి వరకు 48 సార్లు రక్తదానం చేశా. రక్తదానం చేసేందుకు పలువురిని ప్రోత్సహిస్తున్నా.              
– మిడిదొడ్డి నవీన్‌కుమార్,  జ్యోతినగర్, కరీంనగర్‌

2013 నుంచి..
బోయినపల్లి మండల కేంద్రంతో పాటు  బూర్గుపల్లి గ్రామాలకు చెందిన సుమారు 20 మంది యువకులు ఆపదలో ఉన్నవారికి బ్లడ్‌ డొనేట్‌ చేయాలని 2013లో నిర్ణయానికి వచ్చారు. బోయినపల్లికి చెందిన మొగులోజి శ్రీకాంత్, యాద ఆదిత్య, దుబ్బాక మహేశ్, బోయిని రవి, సంబ కిశోర్‌ చౌదరి శ్రీధర్, బూర్గుపల్లికి చెందిన పెరుక మహేశ్, శ్రీపతి సాగర్, రామంచ అశోక్, పెంచాల మహేశ్, రాజేంద్రప్రసాద్, తడగొండకు చెందిన ఎర్ర గిరిధర్‌ తదితరులు పలుసార్లు రక్తదానం చేస్తూ ఆదర్శంగా> నిలుస్తున్నారు. ఇందులో పెరుక మహేశ్‌ 22సార్లు రక్తదానం చేశాడు. 

చదవండి: తల్లులకు టీకా.. చకచకా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement