
కాంట్రాక్టు ఎస్జీటీలుగా నియమితులైన
2008 డీఎస్సీ అర్హులకు అందని వేతనాలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: 2008 డీఎస్సీ అర్హుల్లో 1,382 మందికి ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 15న కాంట్రాక్టు ప్రాతిపదికన ఎస్జీటీలుగా ఉద్యోగాలు ఇచ్చింది. వారికి నెలకు రూ. 31,040 గౌరవ వేతనంగా నిర్ణయించింది. ఇంతకాలం ప్రైవేటు వృత్తుల్లో చాలీచాలని వేతనాలకు పనిచేస్తూ కుటుంబాలను నెట్టుకొచ్చిన వారంతా 17 ఏళ్ల తర్వాత ఎస్జీటీలుగా సంతోషంగా చేరారు. కానీ ఉద్యోగంలో చేరి రెండు నెలలవుతున్నా వారికి ఇప్పటికీ వేతనం అందలేదు.
జీతాల గురించి ఏ అధికారిని అడిగినా సరైన స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదని జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారులు చెబుతున్నారు. వారికి వెంటనే వేతనాలు విడుదల చేయాలని పాఠశాల విద్య సంచాలకులకు వినతిపత్రం అందించామని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అనిల్కుమార్, తిరుపతి ‘సాక్షి’కి తెలిపారు.
ప్రతినెలా 5లోగానే వచ్చేవి..
ఈసారి 13 దాటినా రాలేదు !
హోంగార్డులకు ఇంకా అందని వేతనాలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలోని హోంగార్డులకు ఈ నెల 13వ తేదీ దాటినా ఇంకా వేతనాలు అందలేదు. దీంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి ప్రతి నెలా 5వ తేదీలోగానే వారికి వేతనాలు అందేవి. కానీ ఈసారి ఇంకా బ్యాంకు ఖాతాల్లో జమకాలేదు. అందుకుగల కారణాలను ప్రభుత్వం వెల్లడించలేదు. తెలంగాణలో ప్రస్తుతం సుమారు 16 వేల మంది హోంగార్డులు పనిచేస్తున్నారు. బందోబస్తు డ్యూటీలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, సభలు, సమావేశాలు, ఎన్నికల విధుల్లో పోలీసులతో సమానంగా వారు వి«ధులు నిర్వహిస్తున్నారు.
అయినప్పటికీ ప్రభుత్వం హోంగార్డులను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించట్లేదు. టీఏ, డీఏ, హెచ్ఆర్ఏలతోపాటు యూనిఫాం అలవెన్స్ సైతం ఇవ్వట్లేదు. రిటైరైనా ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు కల్పించట్లేదు. ప్రభుత్వం ఇటీవల హోంగార్డులకు హెల్త్కార్డులు ఇస్తామని ప్రకటించినా ఆ ప్రక్రియ ఇంకా అమలుకు నోచుకోలేదు. మరోవైపు ఏపీలో పనిచేస్తున్న సుమారు 15 వేల మంది హోంగార్డులకు సైతం ఈ నెల ఇంకా వేతనాలు అందకపోవడం గమనార్హం.