సాక్షి, హైదరాబాద్: ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఏటీఎం క్యాష్ దోపిడీ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ చోరీ ఘటనను ఛేదించిన పోలీసులు.. ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్ తన కుమారుడితో కలిసి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. రీఫిలింగ్ వ్యాన్ నుంచి డ్రైవర్ శ్రీనివాస్ నగదు ఎత్తుకెళ్లాడు. మంగళవారం మధ్యాహ్నం సంతోష్నగర్-రెయిన్ బజార్ మెయిన్రోడ్డులో ఎస్బీఐ ఏటీఎంలో నగదు డిపాజిట్ చేయడానికి వచ్చారు.
ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎంలో కస్టోడియన్లు, గన్మెన్ నగదు డిపాజిట్ చేయడానికి వెళ్తున్న సమయంలో ఇదే అదునుగా భావించి ముందస్తు ప్లాన్ ప్రకారం వ్యాన్ డ్రైవర్ శ్రీనివాస్ రూ.17 లక్షలు ఉన్న బ్యాగ్తో అక్కడికి ముందుగానే సిద్ధంగా ఉంచిన బైక్పై పరారయ్యాడు.
కస్టోడియన్లు, గన్మెన్ వ్యాన్ దగ్గరికి వచ్చేసరికి శ్రీనివాస్ కనిపించకపోవడంతో పాటు, బ్యాగు లేకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సురేష్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేకంగా ఐదు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు.. టూ వీలర్పై వెళ్ళింది తండ్రి కొడుకులుగా నిర్థారించారు.
కన్న కొడుకు సహాయంతో చోరీకి స్కెచ్ వేసిన జగిత్యాలకు చెందిన శ్రీనివాస్.. కొన్ని నెలల క్రితమే క్లియర్డ్ సెక్యూరిటీస్లో డ్రైవర్గా చేరారు. బైక్పై శ్రీనివాస్, అతని కుమారుడు ఉప్పుగూడ వరకు వెళ్లారు. అక్కడ చిన్న కుమారుడిని పిలిపించి అతనికి కొంత నగదును ఇచ్చాడు. అక్కడి నుండి క్యాబ్లో శంషాబాద్ ఓఆర్ఆర్ వరకు శ్రీనివాస్, అతని కుమారుడు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.


