
పసుపు రైతుల దశ మార్చనున్న బోర్డు
భారత్ ఆర్గానిక్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఏర్పాటుకు కేంద్రం సన్నాహాలు
స్థానికంగా ఆర్ అండ్ డీ సెంటర్ ఏర్పాటు చేస్తామన్న అమిత్షా
ఐదేళ్లలో బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులకు ప్రణాళికలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డుకు అనుబంధంగా పసుపు ఎగుమతుల పెంపు లక్ష్యంతో ‘భారత్ ఆర్గానిక్ కోఆపరేటివ్ లిమిటెడ్’ను ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో ఆర్గానిక్ పసుపు పండించే విషయమై స్థానికంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్అండ్డీ) సెంటర్ను ఏర్పాటు చేస్తామన్న కేంద్ర సహకార, హోంశాఖ మంత్రి అమిత్షా ప్రకటనతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అదేవిధంగా కో ఆపరేటివ్ ఎక్స్పోర్ట్ ఓరియంట్ యూనిట్ ఏర్పాటుకు సైతం కేంద్రం సన్నాహాలు చేస్తుండటంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
దీని ద్వారా పసుపు బ్రాండింగ్–మార్కెటింగ్–ఎక్స్పోర్ట్ పాలసీతో వచ్చే ఐదేళ్లలో ఒక బిలియన్ డాలర్ల (రూ.8 వేల కోట్లు) ఎగుమతులు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఇందూరు బ్రాండ్’ పేరిట తామే పసుపు సేద్యం చేయడంతో పాటు ఎగుమతులు చేసేందుకు కూడా అవకాశాలు లభిస్తాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎగుమతులు భారీగా పెరిగితే ప్రస్తుతం ఉన్న క్వింటాల్ పసుపు ధర రూ.15 వేల నుంచి రూ.50 వేలకు పెరుగుతుందని చెప్పడంతో రైతుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది. తమ ప్రాంతానికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కుతుందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విత్తనం నుంచి ఎగుమతుల వరకు అండగా..
కొంతకాలం క్రితం వరకు సుగంధ ద్రవ్యాల బోర్డు కింద ఉన్న పసుపు పంటను విడదీసి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయడమే కాకుండా దీన్ని నిజామాబాద్లో నెలకొల్పింది. ప్రత్యేక బోర్డుతో రైతులకు అభివృద్ధి చేసిన, తెగుళ్లు తట్టుకునే కొత్త వంగడాలు అందుబాటులోకి వస్తాయి. విత్తనాలు మొదలు పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ వరకు రైతులకు సహకారం లభిస్తుంది. అవసరాన్ని బట్టి పసుపు బోర్డు రైతులకు విత్తనం అందించి పంటను బై బ్యాక్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. మరోవైపు రాయితీలు సైతం పెరుగుతాయి. పసుపు తవ్వకం, ఆర బెట్టడం, ఉడక బెట్టడం, ఎండబెట్టడం, పాలిష్ చేయడానికి అవసరమైన యంత్రాలను రాయితీపై అందిస్తారు. కొత్త వంగడాల అభివృద్ధితో పాటు పసుపు పంట విత్తిన తర్వాత సాగుకు శాస్త్రీయ, సాంకేతిక పద్ధతులు అవలంబించే విషయంలో శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు ఇస్తారు.
తద్వారా దిగుబడి పెరడమే కాకుండా పంటలో నాణ్యతకు అవకాశం ఉంటుంది. ఇక పసుపు పంట మార్కెటింగ్ కోసం అంతర్జాతీయ కంపెనీలను తీసుకువచ్చే బాధ్యత సైతం బోర్డు తీసుకుంటుంది. ఎఫ్పీవోలు (రైతు ఉత్పత్తిదారుల సంఘాలు) ద్వారా పసుపు ఆరబెట్టి, ఉడకబెట్టి, పాలిష్ చేసి, పౌడర్ చేసి, ప్యాకెట్లు చేసి ప్రత్యేక బ్రాండ్ల ద్వారా నేరుగా ఎగుమతులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు కూడా కేంద్రమంత్రి ప్రకటించారు. తదుపరి దశలో ఇక్కడ పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేసేందుకు కూడా కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జిల్లాకు పసుపు శుద్ధి కర్మాగారాలు తరలి వస్తాయని, దీంతో ఈ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని స్థానికులు చెబుతున్నారు.
సాగు పెంచేలా ప్రణాళికలు
పసుపు బోర్డు నేపథ్యంలో పసుపు సాగు విస్తీర్ణాన్ని 2008లో మాదిరిగా లక్ష ఎకరాలకు పైగా పెంచేలా ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కేంద్రం ప్రణాళికలు తయారు చేస్తోంది. నిజామాబాద్ మార్కెట్కు గతంలో 12 లక్షల క్వింటాళ్లకు పైగా పసుపు వచ్చేది. రానురాను విస్తీర్ణం తగ్గడంతో పంట ఉత్పత్తి సైతం భారీగా తగ్గుతూ వస్తోంది. గత సీజన్లో రాష్ట్రంలో 40 వేల ఎకరాల లోపే పసుపు సాగు చేశారు. తాజాగా ముగిసిన సీజన్లో నిజామాబాద్ మార్కెట్కు 8 లక్షల క్వింటాళ్ల పసుపు మాత్రమే వచ్చింది. రాష్ట్రంలో మొత్తం పసుపు సాగులో 65 శాతం ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఉండటం గమనార్హం. తదుపరి స్థానాల్లో జగిత్యాల, నిర్మల్, వికారాబాద్, మహబూబాబాద్ జిల్లాలు ఉన్నాయి.
రైతులకు ఎగుమతి అవకాశాలు
పసుపు బోర్డు ఏర్పాటుతో తెలంగాణలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది. భారత్ ఆర్గానిక్ కోఆపరేటివ్ లిమిటెడ్ పేరిట పసుపు ఎగుమతులు చేసేందుకు నేరుగా రైతులకే అవకాశం లభిస్తుంది. విలువ ఆధారిత పంట ఉత్పత్తులను రైతులే అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతి చేసే అవకాశం కలుగుతుంది. దీంతో రైతులకు మరింత లబ్ధి చేకూరుతుంది. – పాట్కూరి తిరుపతిరెడ్డి, పసుపు రైతు, ఎఫ్పీవో చైర్మన్, మనోహరాబాద్
పోరాటానికి దక్కిన గౌరవం
పసుపు బోర్డు సాధన కోసం ఏళ్ల తరబడి అనేక పోరాటాలు చేశాం. ఈ క్రమంలో మాపై అనేక కేసులు అయ్యాయి. వీటికి సంబంధించి ఇప్పటికీ కోర్టుకు తిరుగుతున్నాం. పసుపు బోర్డు రావడంతో మా పోరాటా నికి గౌరవం దక్కింది. 9 నెలల పాటు సాగు చేసే ఈ పంటకు బోర్డుతో మద్దతు ధర దక్కడంతో పాటు ఎగుమతులు సైతం చేసుకునే అవకాశం కలుగుతుందని ఆశిస్తున్నాం. – చింతలపల్లి గంగారెడ్డి, పసుపు రైతు, మునిపల్లి