‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. 5 గంటల పాటు వాడీవేడిగా వాదనలు

Trs Mlas Poaching Case Telangana High Court Heated Arguments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో హైకోర్టులో వాదనలు వాడీవేడిగా సాగాయి. కిక్కిరిసిన కోర్టు హాల్‌లో ఉదయం దాదాపు 11 గంటలకు ప్రారంభమైన వాదనలు.. భోజనం విరామం తరువాత.. సాయంత్రం 5 గంటల వరకు (5 గంటలు) కొనసాగాయి. న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌ రెడ్డి సుదీర్ఘ వాదనలను విన్నారు. తదుపరి విచార ణను ఈ నెల 6కు వాయిదా వేశారు.

సిట్‌ దర్యాప్తునకు సహకరించాలని భారత్‌ ధర్మ జన సేన (బీడీజేఎస్‌) అధ్యక్షుడు తుషార్‌ వెల్లప్పల్లిను ఆదేశించారు. తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఆయన్ను అరెస్టు చేయొ ద్దని అధికారులను ఆదేశించారు. కాగా, ఈ కేసులో ఫోన్‌ ట్యాపింగ్‌ సంబంధించి దాఖలైన పిటిషన్‌ను కొట్టివేశారు. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని బీజేపీతో పాటు నిందితులు, 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు అందుకున్న వారు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు.

తొలుత వాదనలు ప్రారంభం కాగానే.. అదనపు అడ్వొకేట్‌ జనరల్‌(ఏఏజీ) రాంచంద్రరావు కౌంటర్‌ దాఖలు చేశారు. నిందితులకు బీజేపీ నేతలకు మధ్య జరిగిన వాట్సాప్‌ సంభాషణల ప్రతిని, ఆ పార్టీ పెద్దలతో నిందితులు దిగిన ఫొటోలను కోర్టుకు అందజేశారు. అలాగే కేసు కీలక ఆధారాల ను సిట్‌ సమరి్పంచింది. తర్వాత.. భారత్‌ ధర్మ జన సేన (బీడీజేఎస్‌) అధ్యక్షుడు తుషార్‌ వెల్లప్పల్లికి నోటీసులు ఇవ్వడంపై ఆయన తరఫు న్యాయవాది హెగ్డే అభ్యంతరం తెలిపారు. అనారోగ్యం కారణంగా హాజరుకాలేనని, తర్వాత వస్తానని చెప్పినా పట్టించుకోకుండా ఆయనపై లుక్‌ఔట్‌ నోటీసులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. సిట్‌ నోటీసులను నిలుపుదల చేయాలని కోరారు.  

సిట్‌.. మీడియాకు లీకులిస్తోంది.. 
ముగ్గురు నిందితుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది మహేశ్‌ జెఠ్మలానీ వాదిస్తూ.. ‘ఏ కేసులోనైనా దర్యాప్తు పారదర్శకంగా, నిజాయతీగా జరగాల్సిన అవసరం ఉంది. కానీ, ఎమ్మెల్యేలకు ఎర కేసులో పోలీసులు పక్షపాతం చూపిస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు నమోదు చేశారు. దర్యాప్తు అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ, దర్యాప్తు అలా సాగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే సిట్‌ పనిచేస్తోంది. ఫామ్‌హౌస్‌ ఘటన జరిగిన రోజే సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు.

తెలంగాణ హైకోర్టుతో పాటు ఇతర హైకోర్టులకు దర్యాప్తు సీడీలు, ఇతర వివరాలు సీఎం పంపారు. దర్యాప్తు.. ఏ అంశమైనా బయటకు పొక్కనీయకుండా విచారణ సాగించాలి. కానీ, కీలక సమాచారం మీడియాకు లీక్‌ చేస్తున్నారు. దర్యాప్తు ఎలా జరగాలనే విషయంపై పలు హైకోర్టులు ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. ఈ కేసులో పలు ఉల్లంఘనలు జరిగాయి. సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు బృందంతో విచారణకు ఆదేశించాలి’ అని న్యాయమూర్తిని కోరారు.  

సీబీఐ విచారణ అవసరం లేదు... 
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్‌ దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందని, సీబీఐకి అప్పగిస్తే వీగిపోవడం ఖాయమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తు చేసిన కొన్ని కేసులు వీగిపోయిన ఉదంతాలను ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు.

‘ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడం తీవ్ర నేరం. ఈ కేసును ఎంతో వేగంగా చేయాల్సిన అవసరం ఉంది. ఐపీఎస్‌లు కేంద్రం ఆధ్వర్యంలో పనిచేస్తారు. వారు రాజకీయ ఒత్తిడులకు తలొగ్గే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో సిట్‌ దర్యాప్తు కొనసాగుతుంది అనడానికి ఆధారాలు లేవు. ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న వీడియోలు, వాయిస్‌ రికార్డులు సీజే, ఇతరులకు పంపడం తప్పే. ఈ విషయంలో క్షమాపణలు చెప్పాం. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే కుట్ర జరిగింది.

బీజేపీకి సంబంధం లేదంటూనే నిందితుల తరఫున పిటిషన్లు వేస్తున్నారు. ఈ వ్యవహారంలో కేసు నమోదైన మరుక్షణం నుంచి బలహీనం చేసే ప్రయత్నం జరుగుతోంది. గడిచిన కొన్నేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవాలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. పారీ్టగానీ, ప్రభుత్వంగానీ ప్రమాదంలో పడినప్పుడు పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా స్పందించే హక్కు ఆయనకు ఉంటుంది. అందులో భాగంగానే మీడియా భేటీలో ప్రజలకు వివరాలు వెల్లడించారు. ఈ కేసులో సీబీఐ విచారణ అవసరం లేదు’అని నివేదించారు.

తమ వద్ద ఆధారాలున్నాయంటూ సిట్‌ అందరికీ నోటీసులు ఇస్తూ పోతోందని, అవేంటో కోర్టుకు కూడా చెప్పడం లేదని బీజేపీ తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రభాకర్‌ పేర్కొన్నారు. సైబరాబాద్‌ సీపీ మీడియాకు వివ రాలు వెల్లడించారని, పోలీసుల విచారణ వద్దన్నందుకు.. అదే పోలీస్‌ ఉన్నతాధికారులతో సిట్‌ ఏర్పా టుచేయడం సమంజసమా.. అని ప్రశ్నించారు. ఇక, న్యాయవాది శ్రీనివాస్‌ తరఫున సీనియర్‌ న్యాయ వాది ఉదయ హోల్లా వాదనలు వినిపించారు.
చదవండి: మంత్రి గుంగుల ఇంటికి సీబీఐ బృందం.. ఢిల్లీకి రావాలని సమన్లు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top