ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్‌, నిఖిల్‌ మృతి.. చెరువు వద్ద ఏం జరిగింది? | Three Police Died By Commits Suicide In Kamareddy, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్‌, నిఖిల్‌ మృతి.. చెరువు వద్ద ఏం జరిగింది?

Dec 26 2024 7:19 AM | Updated on Dec 26 2024 10:49 AM

Three police died in kamareddy

కామారెడ్డి క్రైం: భిక్కనూరులో పనిచేస్తున్న ఎస్‌ఐ సాయికుమార్‌, బీబీపేటలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ శృతితో పాటు బీబీపేటకు చెందిన యువకుడు నిఖిల్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. వీరంతా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా ఎస్‌ఐ మృతదేహాన్ని వెలికితీశారు. 

వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువు సమీపంలో ఎస్‌ఐ కారు లభ్యం కావడం, చెరువు వద్ద చెప్పులు ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసు అధికారులు భావించారు. బుధవారం సాయంత్రం నుంచి శవాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు, ఫైర్‌ సిబ్బంది చెరువులో దిగి మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. 

అర్ధరాత్రి 12.30 గంటలకు కానిస్టేబుల్‌ శృతి, యువకుడు నిఖిల్‌ మృతదేహాలు దొరికాయి. గురువారం ఉదయం ఎస్‌ఐ మృతేదేహాన్ని వెలికితీశారు. ఇక, ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్‌తో పాటు యువకుడు కలిసి చెరువు వద్దకు చేరుకున్నారా? వారి మధ్యన ఉన్న గొడవలేంటి? ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటారు? అన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఎస్‌ఐ సాయికుమార్‌ గతంలో బీబీపేట పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహించారు. అక్కడ కానిస్టేబుల్‌గా శృతి పనిచేసేది. ఇప్పుడు కూడా అక్కడే విధులు నిర్వహిస్తోంది. 

బీబీపేటకు చెందిన నిఖిల్‌ సొసైటీలో ఆపరేటర్‌గా పనిచేస్తూనే, కంప్యూటర్లు మరమ్మతులు చేస్తుంటాడని తెలుస్తోంది. పోలీసు స్టేషన్‌లోని కంప్యూటర్లకు ఏదైనా సమస్య వస్తే నిఖిల్‌ వచ్చి సరి చేసి వెళతాడని చెబుతున్నారు. అయితే ఈ ముగ్గురి మధ్యన ఉన్న గొడవలేంటి అన్నది బయటకు వెళ్లడి కావడం లేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement