సాక్షి, హైదరాబాద్: కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో సర్దార్ పటేల్ నగర్లోని ఆలయంలో చోరీ జరిగింది. వెంకటేశ్వరస్వామి ఆలయంలో గర్భగుడి తాళాలు పగులగొట్టి విగ్రహానికి ఉన్న నగలు అపహరించారు. సుమారు రూ.30 లక్షల విలువ చేసే 15 తులాల వెండి ఆభరణాలతో పాటు 3 తులాల బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుడిలోకి ప్రవేశించి చోరీ చేసినట్లు గుర్తించారు.
తెల్లవారుజామున రోజు వారిలానే ఆలయాన్ని తెరిచి పూజలు నిర్వహించే క్రమంలో పూజారులు గుర్తించారు. వెంటనే ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


