ఫ్యూచర్‌ సిటీలో ‘మరుబెని’ పార్కు | Telangana: Marubeni Corporation to establish Industrial Park in Future City | Sakshi
Sakshi News home page

ఫ్యూచర్‌ సిటీలో ‘మరుబెని’ పార్కు

Apr 18 2025 3:28 AM | Updated on Apr 18 2025 3:28 AM

Telangana: Marubeni Corporation to establish Industrial Park in Future City

గురువారం టోక్యోలో మరుబెని కంపెనీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు అనువుగా అధునాతన పారిశ్రామిక పార్కు అభివృద్ధి

రూ.1,000 కోట్ల ప్రారంభ పెట్టుబడికి జపాన్‌ సంస్థ సంసిద్ధత 

సీఎం రేవంత్‌ బృందం జపాన్‌ పర్యటనలో కీలక ఒప్పందం 

30 వేలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయన్న ముఖ్యమంత్రి 

జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ ఏజెన్సీతోనూ సీఎం చర్చలు 

మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుకు రూ.11,693 కోట్ల రుణం కోసం విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌:  హైదరాబాద్‌ ఫ్యూచర్‌ సిటీలో అభివృద్ధి చేయనున్న మొట్టమొదటి నెక్ట్స్‌ జెన్‌ ఇండ్రస్టియల్‌ పార్కులో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 30 వేలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. దేశంలోనే మొట్టమొదటి నెట్‌ జీరో సిటీగా ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణలో వ్యాపారానికి అనువైన అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే వారికి తమ ప్రభుత్వం తరఫున మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.

జపాన్‌ పర్యటనలో ఉన్న సీఎం నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో అక్కడి వ్యాపార దిగ్గజ సంస్థ ‘మరుబెని’ప్రతినిధులు గురువారం టోక్యోలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ ఫ్యూచర్‌ సిటీలో అత్యంత అధునాతన వసతులతో కూడిన (నెక్ట్స్‌ జెన్‌) పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసేందుకు ‘మరుబెని’సంసిద్ధత వ్యక్తం చేసింది. 600 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కును దశల వారీగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో కీలక పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకుంది. 

పార్కు ఏర్పాటుకు సంబంధించిన ‘లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌’పై సీఎం రేవంత్‌ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ‘మరుబెని’ప్రతినిధులు సంతకాలు చేశారు. రూ.1,000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో సంస్థ ఈ ప్రాజెక్టును చేపడుతుంది.  

తయారీ రంగంలో విదేశీ పెట్టుబడులకు చాన్స్‌ 
జపాన్‌కు చెందిన కంపెనీలతో పాటు ఇతర బహు ళ జాతి కంపెనీలు హైదరాబాద్‌లో తమ తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు వీలుగా అభివృద్ధి చేసే ఈ పార్కు రూ.5 వేల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్, గ్రీన్‌ ఫార్మా, ప్రెసిషన్‌ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్‌ రంగాలపై ఈ పార్కు దృష్టి పెడుతుంది. అధునాతన తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు నైపుణ్యంతో కూడిన ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది. తెలంగాణ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి దూరదృష్టితో వ్యవహరిస్తున్నారని ‘మరుబెని’బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి దై సకాకురా అభినందించారు. 

65 దేశాల్లో ‘మరుబెని’కార్యకలాపాలు 
    మరుబెని కంపెనీ 65 దేశాల్లో 410 కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్తు, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్‌ లీజింగ్, రియల్‌ ఎస్టేట్, ఏరోస్పేస్, మొబిలిటీ రంగాలలో ఈ కంపెనీ అగ్రగామిగా ఉంది. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 50 వేలకు పైగా ఉద్యోగులున్నారు. 

సోనీ కార్యాలయాన్ని సందర్శించిన సీఎం 
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం గురువారం ఎలక్ట్రానిక్‌ దిగ్గజ సంస్థ ‘సోనీ’ప్ర«దాన కార్యాలయాన్ని సందర్శించింది. సోనీ కార్పొరేషన్‌ తయారు చేస్తున్న కొత్త ఉత్పత్తులు, చేపడుతున్న కొత్త కార్యక్రమాల గురించి వీరికి కంపెనీ ప్రతినిధులు వివరించారు. సోనీ కంపెనీ యానిమేషన్‌ అనుబంధ సంస్థ ‘క్రంచైరోల్‌’పై ప్రతినిధులతో జరిగిన చర్చల్లో.. యానిమేషన్, వీఎఫ్‌ఐ, గేమింగ్‌ రంగాలకు హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలు, అనుకూలతలను తెలంగాణ ప్రతినిధి బృందం వివరించింది. ఎండ్‌ టు ఎండ్‌ ప్రొడక్షన్‌ సామర్థ్యాన్ని కలిగి ఉండే అత్యాధునిక ఫిల్మ్‌ సిటీ ఏర్పాటు చేయాలనే తన ఆలోచనలను ‘క్రంచైరోల్‌’ప్రతినిధులతో ముఖ్యమంత్రి పంచుకున్నారు. 

మెట్రో సహా అభివృద్ధి పనులకు నిధులపై ‘జైకా’తో చర్చలు 
జపాన్‌ ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌ ఏజెన్సీ (జైకా) ఉన్నత స్థాయి యాజమాన్య బృందంతో కూడా ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నిధుల సమీకరణపై చర్చించారు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.24,269 కోట్ల అంచనాలతో చేపట్టనున్న మెట్రో రైలు రెండో దశ ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రం తుది పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అవసరమమ్యే వ్యయంలో 48 శాతం అనగా రూ.11,693 కోట్లు రుణంగా ఇవ్వాలని కోరారు.

ప్రపంచ పెట్టుబడుల గమ్య స్థానంగా, అత్యంత ఆకర్షణీయమైన నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు. ప్రపంచ స్థాయి నగరాలైన న్యూయార్క్, టోక్యోతో సమానంగా నగరాన్ని అభివృద్ది చేసే యోచనలో తమ ప్రభుత్వం ఉందని చెప్పారు. మెట్రో రైలు రెండో దశతో పాటు మూసీ పునరుజ్జీవనం, రీజనల్‌ రింగ్‌ రోడ్డు నుంచి అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు అనుసంధానించే రేడియల్‌ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కూడా ఆర్థిక సాయం అందించాలని కోరారు.

కాగా జైకా, తెలంగాణ నడుమ అనేక ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయని జైకా సీనియర్‌ ప్రెసిడెంట్‌ షోహెయ్‌ హరా వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులకు జైకా నుంచి ఆర్థిక సాయం పొందేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement